వినోభానగర్ వద్ద ప్రధాన రహదారి గోతులమయం

 ప్రమాదాలకు గురవుతున్న వాహనాలు

జూలూరుపాడు, ఆగష్టు 3, జనంసాక్షి: మండల పరిధిలోని వినోభానగర్ గ్రామం సమీపంలో తల్లాడ -కొత్తగూడెం ప్రధాన రాష్ట్రీయ రహదారి గోతులమయంగా మారింది. ఈ వర్షాకాలం ప్రారంభంలోనే వినోభానగర్ గ్రామం వద్ద తారు రోడ్డు పూర్తిగా దెబ్బతింది. భారీ వర్షాల కారణంగా పెద్ద పరిమాణంలో గుంటలు ఏర్పడ్డాయి. ఈ రహదారిపై రాత్రింబవళ్లు నిత్యం వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. రాత్రి సమయంలో వాహనాలను నడిపే సమయంలో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. నడిరోడ్డుపై ఉన్న లోతైన గుంటల్లో నిండుగా నీళ్ళు ఉండటంతో అకస్మాత్తుగా గుంటల్లో పడి వాహనదారులు గాయాలపాలై ఆసుపత్రిలో చేరిన సంఘటనలు ఉన్నాయి. ఆర్అండ్ బి శాఖ ఇంజనీర్లు తక్షణమే స్పందించి రోడ్డు మరమ్మత్తులకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు