వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో ఘనుడు

జగన్‌ తీరుపై మండిపడ్డ టిడిపి నేత లోకేశ్‌

అమరావతి,నవంబర్‌ 23 (జనంసాక్షి): వ్యవస్థల విధ్వంసానికి జగన్‌రెడ్డి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ విమర్శించారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఖండిస్తున్నానన్నారు. పంచాయతీల సొమ్మును స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి  విద్యుత్‌ బకాయిలంటూ రూ.345 కోట్లు కట్‌ చేశారని లోకేష్‌ అన్నారు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం కేటాయించిన రూ.965 కోట్లను ప్రభుత్వం పక్కదారి పట్టించడం గ్రావిూణ ప్రజలకు తీరని అన్యాయం చెయ్యడమే అని మండిపడ్డారు.  15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులతో గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.  సర్పంచులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తరువాత ఖాతాల్లో సొమ్ము జీరో అయితే వారు ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలి అని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం మళ్లించిన సొమ్ముని పంచాయతీల ఖాతాల్లో వేయాలని లోకేష్‌ డిమాండ్‌ చేశారు.