సింగరేణి కార్మికుల వేతనాలు పెంచాలి

పదోన్నతులతో పాటు ఖాళీల భర్తీ చేపట్టాలి
కొత్తగూడెం,అక్టోబర్‌21 ( జనం సాక్షి):  పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సింగరేణి కార్మికుల వేతనాలు యాభై శాతం పెంచాలని, పింఛన్‌ను 40 శాతం పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కార్మికులకు  పదోన్నతులు కల్పించి, క్లరికల్‌ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. సింగరేణి చరిత్రలో ఎన్నడూలేని విధంగా కోట్లకు పైగా లాభాలు వస్తున్నాయన్నారు. సింగరేణిలోని ఐదు భూగర్భగనుల్లో పొరుగు ఔట్‌సోర్సింగ్‌ ద్వారా బొగ్గును వెలికితీసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తుందని, ఈ విధానం సరికాదని  అన్నారు. పొరుగు సేవల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బొగ్గును ఉత్పత్తి చేసేందుకు యజమాన్యం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందన్నారు. దీనివల్ల ఉపరితల గనుల్లో మాదిరిగా భూగర్భ గనుల్లో ముఖ్యమైన పనులు కాంట్రాక్టు కార్మికులే చేయాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే ఉపరితల గనుల్లో 75 శాతం పనులను కాంట్రాక్టు కార్మికులు చేస్తుంటే కేవల 25 శాతం పనులను కంపెనీ ఉద్యోగులు చేస్తున్నారన్నారు. సింగరేణిలోకి పొరుగు సేవల వినియోగం ఎక్కువైతే రానున్న రోజుల్లో కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందన్నారు. సింగరేణిలోని గోలేటి-1ఏ గనిని, ఇల్లందు 21 గనిని, గోదావరిఖని 10ఏ గనులను మూసివేసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందన్నారు. ఎన్నికల సందర్భంగా సింగరేణిలో కొత్త భూగర్భ గనులను తీసుకువచ్చి ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్న కేసీఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు భూగర్భ గనుల మూసివేతను నిలిపివేయాలన్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు యాజమాన్యం ప్రయత్నిస్తుంటే గుర్తింపు సంఘం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. శ్రీరాంపూర్‌ ఉపరితలగనిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని కోరారు.