సైబీరియా బొగ్గుగనిలో భారీ అగ్నిప్రమాదం

52 మంది దుర్మరణం చెందినట్లు ప్రకటన

సహాయక చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం

మాస్కో,నవంబర్‌26(జనం సాక్షి ):  రష్యాలోని సైబీరియా  బొగ్గుగనిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 52 మంది మృతి చెందగా, పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. రష్యాలోని సైబీరియాలో ఈ పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ కెమెరోవో ప్రాంతంలోని బొగ్గుగనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 52 మంది చనిపోయారు. ఆరుగురు సెక్యురిటీ అధికారులు కూడా ఈ ఘటనలో బలయ్యారు. ఐదేళ్లలో అత్యంత ఘోరమైన గని ప్రమాదంగా  రష్యన్‌ అధికారులు భావిస్తున్నారు.  గనిలో ప్రాణాలతో బయటపడిన వారిని రక్షించే అవకాశం లేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. చాలా మృతదేహాలు ఇంకా లోపల ఉన్నాయి. వాటిని ఉపరితలంపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బొగ్గు పొగ కారణంగా వెంటిలేషన్‌ సమస్యతో 11 మంది మైనర్లు మరణించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. 250 విూటర్ల లోతులో ఉన్నటువంటి వారిని గుత్తించడం రెస్క్యూ టీమ్స్‌కు కష్టంగా మారింది. అయితే కొందరు కార్మికులను మాత్రం రక్షించారు. అందులో 38 మందిని ఆసుపత్రిలో చేర్చారని..వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.  ప్రమాదం జరిగిన సమయంలో 285 మంది భూగర్భంలో పని చేస్తున్నారు. వారిలో ఎక్కువ మందిని ముందుగానే గని నుండి బయటకు తీశారు.