స్కాలర్ షిప్ ల రద్దు నిర్ణయాన్ని బీజేపీ వెంటనే ఉపసంరించాలి

నందిగామ సైదులు డిమాండ్


మునగాల, డిసెంబర్ 02(జనంసాక్షి): విద్యార్థుల స్కాలర్‌షిపుల రద్దు వల్ల పేద విద్యార్థులకు బీజేపీ ప్రభుత్వం చదువులకు దూరం చేస్తుందని, తక్షణమే ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మునగాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ ఆర్థిక సంవత్సరం నుండి 8వ తరగతిలోపు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ పేద విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిపులను ఇవ్వబోమని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సరైందికాదని, తక్షణమే ఈ ప్రకటనను వెనక్కు తీసుకోవాలని, కేవీపీఎస్ డిమాండ్ చేస్తుందన్నారు. పేద విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్‌షిప్ లు వారి చదువుకు ఎంతో కొంత ఉపశమనంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉచిత నిర్బంధ విద్యను సాకుగా చూపి కేవలం 9,10 తరగతుల విద్యార్థులకే ఈ స్కాలర్‌షిపులను పరిమితం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులు చదువులకు దూరమై డ్రాపౌట్స్‌ పెరిగే ప్రమాదముందన్నారు. దేశం 100శాతం అక్షరాస్యత సాధించాలని, ఒకవైపు చెబుతూనే ఇలాంటి ప్రమాదకర నిబంధనలు తేవడంతో లక్ష్యం నెరవేరదు. ఈ క్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. లేనట్లయితే కేవిపిఎస్ మిగతా సామాజిక విద్యార్థి ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమం చేపడుతామని ఆయన అన్నారు.