హరితహారం మొక్కల తొలగింపు

వ్యక్తి 3వేల జరిమానా విధింపు
సిద్దిపేట,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   హరితహారం మొక్కలను తొలగించిన వ్యక్తికి మున్సిపల్‌ అధికారులు మూడువేల రూపాయల జరిమానా విధించారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని నాలుగో వార్డులో బానోతు శారద అనే మహిళ ఇంటి నిర్మాణం కోసం 5 హరితహారం మొక్కలను తొలగించింది. గమనించిన వార్డు ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌. రాజమల్లయ్య సోమవారం హరితహారం మొక్కలను తొలగించిన శారదకు మూడువేల రూపాయల జరిమానా విధించారు. హరిత హారం మొక్కలను ఎవరు తొలగించవద్దని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ కృష్ణ, మున్సిపల్‌ సిబ్బంది ప్రశాంత్‌, సంపత్‌ తదితరులు ఉన్నారు.