అసెంబ్లీ, మండలి వాయిదా

హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నాటికి వాయిదా పడ్డాయి. శాసనసభ సమావేశాలను స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి సమావేశాలను ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ శుక్రవారంకి వాయిదా వేస్తూ నిర్ణయం వెలువరించారు. గురువారం సమావేశాల ప్రారంభంలో ఉభయసభల్లో ప్రశ్నోత్తారాలను చేపట్టారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు, సరోగసి, విద్యుత్‌, పాడి పరిశ్రమ, ఇంటర్‌నెట్‌ బ్రాండ్‌ బ్యాండ్‌ సేవలు, నూతన ఆధార్‌ కేంద్రాల ఏర్పాటు, పర్యాటకరంగం అభివృద్ధికి చర్యలు వంటి తదితర అంశాలపై ఉభయ సభల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు.

గురువారం ఉదయం శాసనసభ ప్రారంభమైన తర్వాత తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ ప్రకృతిని పూజించి, పండుగలు జరిపే రాష్ట్రం మనదని అన్నారు. పర్యాటక రంగంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధికి నిధుల లోటు లేదని పేర్కొన్నారు. స్వదేశీ దర్శన్‌ కింద రాష్ట్రం మూడు ప్రాజెక్టులను దక్కించుకుందని ఈటల తెలిపారు.