ఇక్రిశాట్లో కొనసాగుతున్న చిరుతవేట
జాడ కోసం అదనంగా కెమెరాల ఏర్పాట్లు
హైదరాబాద్,ఫిబ్రవరి15(జనంసాక్షి): పటాన్చెరు సవిూపంలోని మెట్ట పంటల పరిశోధనా కేంద్రం ఇక్రిశాట్లోకి ప్రవేశించిన చిరుతపులిని పట్టుకునేందుకు ప్రయత్నం కొనసాగుతోంది. పులి అక్కడే సంచరిస్తున్న దృశ్యాలు కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి. నాలుగు రోజులుగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది అదే పనిలో ఉన్నారు. గురువారం తెల్లవారుజాము 2.30 గంటల సమయంలో బోను దగ్గరకు వచ్చిన చిరుత.. అందులోని మేక అరుపులు విని వెళ్లిపోయింది. అంతకుముందు ఆదివారం సాయంత్రం 6.30 గంటలకూ బోను వద్దకు వచ్చి వెనుదిరిగినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయింది. కాగా సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతానికి పులి రావడం లేదని తెలుస్తోంది. కెమెరా దగ్గరకు పులి సవిూపిస్తున్న సమయంలో ‘ప్లాష్’ వస్తుంది. దీన్ని చూసి భయపడి దూరంగా వెళ్లిపోతోందని అధికారులు చెబుతున్నారు. అలాగే ప్రతిరోజూ ఒకటే స్థావరంలోనూ ఉండటం లేదని గుర్తించారు. ఉన్నతస్థాయి అధికారుల సూచనల మేరకు అదనంగా 17 చోట్ల కెమెరాలు అమర్చారు. ప్రస్తుతం ఆవరణలో మొత్తం 28 కెమెరాలు అమర్చి.. కెమెరా దగ్గరలో పులి కనిపించగానే ఎ/-లాష్ వెలిగేలా ఏర్పాట్లు చేశారు. రోజువారీ పర్యవేక్షణకు సహాయ రేంజ్ అధికారి సహా 15 మంది సిబ్బందిని నియమించారు. వీరికి సహకరించేందుకు ఇక్రిశాట్ భద్రతా సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు.


