తుపాకులగూడెం వద్ద బ్యాంరేజీ నిర్మాణం
– శాసన మండలిలో మంత్రి హరీష్రావు వెల్లడి
హైదరాబాద్,నవంబర్7(జనంసాక్షి): ముంపును నివారించడంతో పాటు భూసేకరణ తగ్గించేందుకే కంతనపల్లి బ్యారేజీని తుపాకులగూడెంకు తరలించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. కంతనపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపడితే నాలుగు గ్రామాలు పూర్తిగా, 13 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతాయని హరీశ్రావు పేర్కొన్నారు. బ్యారేజీ ప్రదేశాన్ని మార్చడం వల్ల 233 ఎకరాల భూసేకరణ తగ్గిందని శాసనమండలిలో వెల్లడించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 నాటికి బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తవుతాయని తెలిపారు. సకాలంలో పనులు పూర్తికాని పక్షంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా 38.5టీఎంసీల నీటిని తీసుకునే అవకాశం ఉండగా 60 టీఎంసీలకు పెంచినట్లు వెల్లడించారు. తుపాకుల గూడెం వద్ద నిర్మించే బ్యారేజీ వద్ద 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేందుకు జెన్కోకు పనులు అప్పగించినట్లు మంత్రి తెలిపారు.



