మాజీఎంపి బిఎన్‌ రెడ్డి కన్నుమూత

హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): మాజీ ఎంపీ, ప్రముఖ వాస్తు నిపుణుడు బద్దం నర్సింహారెడ్డి(బీఎన్‌రెడ్డి) (82) సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న బీఎన్‌ రెడ్డి.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బీఎన్‌ రెడ్డి మృతి పట్ల ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు. మిర్యాలగూడ ఎంపీగా బీఎన్‌రెడ్డి పని చేశారు. ఈయన స్వగ్రామం నల్లగొండ జిల్లా నకిరేకల్‌. మాజీ ఎంపీకి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉండడంతో ఆయన భౌతిక కాయాన్ని ఆస్పత్రిలో భద్రపరిచారు. వారు హైదరాబాద్‌ చేరుకున్న తరవాతనే అంత్యక్రియలు నిర్వహిస్తారు.