ప్రియాంకకు యూపీ ప్రచార బాధ్యతలు

1

విూరట్‌,జులై 3(జనంసాక్షి):వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ‘స్టార్‌ క్యాంపెయినర్‌’గా సోనియాగాంధీ కుమార్తె, రాహుల్‌ సోదరి ప్రియాంక గాంధీ ప్రచారబరిలోకి దిగబోతున్నారట. 150కి పైగా ర్యాలీల్లో ఆమె పాల్గొనేందుకు వ్యూహరచన జరుగుతోంది. ఎవరూ ప్రచారం సాగించలేనన్ని ఎక్కువ ర్యాలీల్లో ప్రియాంక పాల్గొంటారని ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (యూపీసీసీ) ప్రచార విభాగం చైర్మన్‌ సత్యదేవ్‌ త్రిపాఠిని ఉటంకిస్తూ వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ‘కాంగ్రెస్‌ పార్టీ ఈసారి యూపీ ఎన్నికల్లో పూర్తి సత్తా చాటుకోనుంది. ప్రియాంక ఏకబికిన 150కి పైగా ర్యాలీలో పాల్గొంటారు. ఇంతవరకూ ఆమె అమేథీ, రాయబరేలిలోనే సంప్రదాయంగా ప్రచారం సాగిస్తూ వచ్చారు. ఈసారి తమ ప్రచార పరిధిని ఆమె పూర్తి స్థాయిలో విస్తరించబోతున్నారు’ అని త్రిపాఠీ తెలిపారు. పార్టీ అత్యున్నత స్థాయిలో ప్రియాంక ప్రోగ్రామ్స్‌ ఖరారు కానున్నాయని, దీనికి సోనియాగాంధీ తుది రూపు ఇవ్వనున్నారని ఆయన వెల్లడించారు. కాగా, రాహుల్‌ గాంధీ విదేశాల నుంచి ఇండియాకు తిరిగి రాగానే (జూలై మధ్యలో) లక్నోలో భారీ సదస్సు నిర్వహించి ప్రచార కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుడతారని, అదే కార్యక్రమంలో ప్రియాంకను యూపీ ప్రధాన ప్రచారకర్తగా ప్రకటిస్తారని చెబుతున్నారు.