కంటివెలుగు కోసం 17 బృందాల ఏర్పాటు

మరో మూడు సంచార వైద్య బృందాలతో పరీక్షలు

కలెక్టర్‌ శ్రీ దేవసేన

పెద్దపల్లి,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): జిల్లాలో ఆగస్టు 15 నుంచి కంటి వెలుగులు కార్యక్రమం ప్రారంభం అవుతున్నదనీ కలెక్టర్‌ శ్రీదేవసేన తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు కంటి వెలుగులు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఇందు కోసం జిల్లాలో 17 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరో మూడు సంచార వైద్య బందాలను సైతం కంటి వెలుగులు కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలోని 7లక్షల 95వేల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్‌ వివరించారు. పాడి రైతులకు బర్రెల పంపిణీ కార్యక్రమం ఈ నెల ప్రారంభిస్తున్నామని కలెక్టర్‌ అన్నారు. ఇకపోతే గ్రామాలు సంపూర్ణ పారిశుధ్యం సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రావిూణ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని తెలిపారు. జిల్లాలోని గ్రామాలను సంపూర్ణ పారిశుధ్యం దిశగా తీసుకుపోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ వివరించారు. ఇందులో భాగంగా ఏడాదిన్నర క్రితం వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసిన జిల్లాగా ప్రకటించుకున్నట్లు కలెక్టర్‌ వివరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రావిూణ్‌లో భాగంగా జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో నిలపడానికి జిల్లా ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ శ్రీదేవసేన కోరారు. ఇప్పటి వరకు నిర్మించిన మురుగుదొడ్లను పూర్తి స్థాయిలో వినియోగించడానికి గ్రామస్థాయి పని చేస్తున్న అధికారుల సహకారంతో మురుగుదొడ్లను పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామాల్లో సైన్‌ బోర్డుల ఏర్పాటు, స్వచ్ఛ రథాలతో ప్రచారం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జిల్లా ముందుడాలంటే రానున్న రోజుల్లో గ్రామాలో రోడ్లు విూద చెత్త వేయకుండా, జనావాసాల మధ్య మూత్రశాలలు, మరుగుదొడ్లను శుభంగా ఉండేలా చూసి, జిల్లాకు అత్యధిక మార్కులు వచ్చి స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రావిూణ్‌తో రాష్ట్రంలో ప్రథమ స్ధానంలో నిలుపాలని కోరారు. ఇందులో జిల్లాలోని పంచాయతీలకు పోటీలు నిర్వహిస్తున్నామనీ, వందశాతం పారిశుధ్యం సాధించిన గ్రామాలకు ప్రథమ బహుమతి రూ. 5 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. 4 లక్షలు, తృతీయ బహుమతి రూ. 3 లక్షల బహుమతి అందజేస్తామని కలెక్టర్‌ ప్రకటించారు.

——————