పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి …….. డీఈవో గోవిందరాజులు

నాగర్ కర్నూల్ బ్యూరో మార్చి 17 జనం సాక్షి
ఈ నెల 19వ తేదీ నుండి జరగబోయే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజులు చెప్పారు. మంగళవారం స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు సిబ్బంది సమావేశంలో డీఈవో మాట్లాడుతూ…
 పదో తరగతి పరీక్షలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. 11301 మంది బాలబాలికలు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నారని, వీరిలో రెగ్యులర్‌గా చదివే బాలురు 5561 మంది, బాలికలు 5568 మంది, ప్రయివేటు విద్యార్థుల్లో బాలురు 120 మంది, బాలికలు 52 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. జిల్లాలో 54 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఎ కేటగిరి కేంద్రాలు 48, బి కేటగిరి కేంద్రాలు 8, సి కేటగిరి 5 కేంద్రాలుగా విభజించి పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. పరీక్షల్లో కాపీలు జరగకుండా ప్రత్యేక స్క్వాడ్‌లు తనిఖీ చేస్తాయని, ఫ్లయ్యింగ్‌ స్క్వాడ్‌లు 3, సిట్టింగ్‌ స్క్వాడ్‌లు 54, ఇక స్థానికంగా పరీక్షా కేంద్రాల్లో తహశీల్దారు, ఎంపిడిఒలు తనిఖీలు నిర్వహిస్తారని డిఇఓ గోవిందరాజులు వివరించారు. 568 మంది ఇన్విజిలేటర్లును నియమించామని, రూట్‌ ఆఫీసర్స్‌ 6 మందిని, చీఫ్‌ సూపరింటెండెంట్లు 54 మందిని నియమించామని తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షల్లో ఎటువంటి మాస్‌ కాపీయింగ్‌కు, అవకతవకలకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
వివరించారు. పరీక్షా కేంద్రాల్లో సిబ్బంది తప్పనిసరిగా ఐడెంటిటి కార్డును ధరించాలని, ఉదయం 9.30 గంటల నుండి 12.15 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందుగానే అంటే ఉదయం 8:30 గంటలకు పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని సూచించారు. పరీక్షా హాలులో ఇన్విజిలేటర్లు ఎటువంటి తప్పు చేసినా వారిపై యాక్ట్ 25/1997 చట్టప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థిని తనిఖీ చేశాక పరీక్ష గదిలోకి అనుమతిస్తామని ఆయన తెలిపారు. ఇన్విజిలేటర్లు ఎలాంటి ఫోన్లను వినియోగించరాదని పరీక్ష జరిగే రూమ్‌ల బాధ్యత ఇన్విజిలేటర్ల పైనే ఉంటుందని తెలియజేశారు.
 విద్యార్థులు సివిల్‌ డ్రెస్‌లో మాత్రమే పరీక్షకు హాజరు కావాలని, పాఠశాల యూనిఫారం ధరించి పరీక్షకు హాజరు కావద్దని డిఇవో తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇతర కారణాల వల్లగాని ఆలస్యమైతే  5 నిమిషాలలోపు గ్రేస్‌ పీరియడ్‌ ఇస్తారని, 5 నిమిషాలు దాటితే పరీక్షకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు.
పరీక్షలకు హాజరయ్యే బస్సు పాస్ కలిగిన విద్యార్థులకు వారి హాల్ టిక్కెట్ చూపించి పరీక్ష కేంద్రం వరకు రవాణా సౌకర్యం పొందాలని, విద్యార్థులకు సూచించారు.
 పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించరాదని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో సెల్‌ఫోన్‌ ఉపయోగించిన వారిపై యాక్టు 25/97 కింద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్విజిలేటర్లు, పరీక్షా కేంద్రాలకు వచ్చిన ఇతర సిబ్బంది తప్పనిసరిగా హాజరు రిజిస్టర్లో సంతకం చేయాలి వారికి రెమ్యూనరేషన్‌ చెల్లిస్తామని తెలిపారు. ప్రతి కేంద్రంలో శాని టైజర్ ఏర్పాటు చేయాలని విద్యార్థులకు తీవ్ర ఎండల దృష్టి త్రాగునీటి సౌకర్యం అత్యవసర వైద్య చికిత్స ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
 పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా, అవకతవకలు జరిగినా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని కంట్రరోల్‌ రూమ్‌ నెం.7702775340/9989921105 కు తెలియజేయాలని కోరారు.
 ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి  రాజ శేఖర్ రావు, నోడల్ అధికారి కురుమయ్య జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి సెక్టోరల్ అధికారి నారాయణ యస్. జిఎఫ్ వెంకటయ్య, విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది వెంకట్ పాల్గొన్నారు.