రంగారెడ్డి జిల్లాలో దారుణం

– దిశ తరహాలో మరో దారుణ ఘటన

– యువతిపై అత్యాచారం..హత్య

చిలుకూరు దారిలో వంతెన కింద పడేసిన దుండుగులు

రంగారెడ్డి, మార్చి 17(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన మరవకముందే రంగారెడ్డి జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరిపి.. దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. చేవెళ్ల మండలం తంగడపల్లిలోని ఓ బ్రిడ్జి కింద నగ్నంగా ఉన్న యువతి మృతదేహం లభ్యమైంది. ఆమె తలపై తీవ్ర గాయాలున్నాయి. ఉదయం ఏడు గంటల సమయంలో యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. యువతి మృతదేహంపై బంగారు గొలుసు, చెవి కమ్మలు, ఉంగరం ఉన్నట్టు గుర్తించారు. ఆమెను ఎక్కడి నుంచో తీసుకొచ్చి అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని.. యువతిని గుర్తించకుండా ఉండటం కోసం తలపై రాయితో బాదినట్టు తెలుస్తోందన్నారు. గ్రామ శివారులో ఆమెపై అత్యాచారం చేసి, అనంతరం ముఖంపై బండరాళ్లతో కొట్టి హత్య చేశారని గుర్తించారు. మంగళవారం తెల్లవారుజామున తంగడపల్లి శివారులోని వంతెన కింద గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అమానుష ఘటన చిలుూరు దేవాలయం ప్రధాన రహదారిపై జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం యువతి వివరాలు ఆరా తీసున్నారు. మహిళకు సంబంధించిన వస్తువులు, దుస్తులు ఘటనా స్థలంలో దొరకకపోవడంతో ఆమె వివరాలు సేవరించడం పోలీసులకు ఇదో ఛాలెంజ్ గా మారింది. పోలీస్ జాగిలాలను రప్పించి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.