రణరంగంగా మారిన రావికంపాడు

– భూవివాదం విషయంలో కర్రలతో కొట్టుకున్న ఇరువర్గాలు
– పలువురికి గాయాలు
– ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
భద్రాద్రికొత్తగూడెం, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రవికంపాడులో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూవివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, రాళ్లతో
ఇరువర్గాలు పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో పలువురు గాయపడ్డారు. 1969లో సర్వే నెం. 207లో మూడు ఎకరాల భూమిని చేరుపల్లి కోదండరామారావు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ భూమి కోదండ రామారావు, ఆయన కుమారుడు ఆధీనంలోనే ఉంది. కోదండరామారావు చనిపోవడంతో ఆస్టేల్రియాలో ఉంటున్న ఆయన కొడుకు రామచంద్రరావు రవికంపాడుకు తిరిగి వచ్చారు. పట్టా కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో స్థానికంగా కొంతమంది ఈ భూమిని కాజేయలని చూశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అందరూ కలిసి కోదండ రామారావు కొడుకుకు ఆ భూమి చెందుతుందని తీర్మానించారు. నేపథ్యంలో వ్యతిరేక వర్గంవారు ఆ భూమి తమదంటూ 10మంది వ్యక్తులు రామచంద్రరావు అనుచరులపై దాడికి దిగారు. కర్రలు, రాళ్లు, కత్తులతో దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. న్యాయంగా ఉన్న భూమి విషయంలో కొంతమంది అవినీతి రెవెన్యూ అధికారుల వల్ల ఆ గ్రామంలో ఘర్షణ చోటు చేసుకుంది. కాగా ఇరువర్గాలకు చెందిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు గ్రామంలోనే మోహరించి పరిస్థితిని సవిూక్షిస్తున్నారు. పోలీసులు మరోవైపు ఈ భూమి వివాదానికి సంబంధించి రెవెన్యూ అధికారులను వివరాలు కోరారు. అయితే రీ సర్వే నిర్వహించిన అనంతరం తాము సమగ్ర వివరాలు వెల్లడిస్తామని రెవెన్యూ అధికారులు వెల్లడించారు.