హాజీపూర్‌ ఘటనపై తాత్సారం

సత్వరం పూర్తి చేయాలంటున్న ప్రజలు

దిశ కేసుతో వేగం పెరగగలదన్న భావన

యాదాద్రి భువనగిరి,డిసెబర్‌6(జ‌నంసాక్షి): తెలుగు రాష్టాల్ల్రో పెను సంచలనం సృష్టించిన హాజీపూర్‌ బాలికల వరుస హత్యల కేసు మరోమారు తెరపైకి వచ్చింది. ఈ ఘటనపై ఎందుకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదని ఎమ్మార్పీఎస్‌ వ్వస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. కుమ్రం భీమ్‌ జిల్లాలో జరిగిన లక్ష్మి హత్యాచార ఘటనను, మాజీపూర్‌ ఘటనను పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. కులమతాల ఆధారంగా కేసులను చూడొద్దన్నారు. తాజాగా దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో హజీపూర్‌ ఘటనకు సంబంధించిన కేసుకూడా దర్యాప్తులో వేగం అందుకుంటుందన్న భావన కలుగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ గ్రామంలో ముగ్గురు బాలికలను అత్యాచారం, హత్య చేసిన నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసు అక్టోబర్‌ 10వ తేదీన నల్లగొండ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ ప్రారంభ మైంది. బాధిత కుటుంబ సభ్యులు, పలువురు గ్రామస్తులు, జిల్లా పోలీస్‌ అధికారులతో పాటు మండల రెవెన్యూ అధికారులకు 120 మందికి కోర్టు సమన్లు అందాయి. సైకో శ్రీనివాస్‌రెడ్డి హాజీపూర్‌ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై అఘాయిత్యాలకు పాల్పడి హత్య చేసిన కేసులో వరంగల్‌ సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న శ్రీనివాస్‌ రెడ్డిపై కేసులు నమోదైన 90 రోజుల అనంతరం జూలై 31న యాదాద్రి భునవగిరి ఏసీపీ భుజంగరావు నల్లగొండ పోక్సో కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. హాజీపూర్‌ బాలికల వరుస హత్యల కేసులో విచారణ లో వేగం పెరిగిందని హాజీపూర్‌ బాలికల హత్య కేసుల విచారణ అధికారి ఏసీపీ భుజంగరావు తెలిపారు. ఈ కేసుల్లో ప్రథమంగా బలైన తుంగని కల్పన కేసు మూడేళ్ల క్రితం నాటిది కావడంతో కొంత జాప్యం జరిగిందన్నారు. నేటికీ 100 మందికి పైగా సాక్షులను కోర్టు విచారణ చేసింది. మరికొంత మందిని విచారణ

చేయాల్సి ఉంది. మరో రెండు వారాల పాటు కోర్డులో సాక్షుల విచారణ జరిగే అవకాశం ఉంది. అనంతరం నిందితుడికి కోర్డు శిక్షను ఖరారు చేయనుంది. మహిళలు, యువతులు పోలీసులు వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అవగాహన పెంచుకోవాలి. స్మార్ట్‌ ఫోన్‌లలో యువత మహిళల రక్షణ కోసమే రూపొందించిన హాక్‌ ఐ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఈ మేరకు అన్ని కళాశాలల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు రాష్ట్రంలో యువతులు, మహిళలు, బాలిక లపై దారుణాలు నానాటికి పెరిగిపోతుండడంతో ప్రజల్లో ఆగ్రహం తారస్థాయికి చేరింది. రంగారెడ్డి జిల్లాలో దిశపై సామూహిక అత్యాచారం, హత్య, వరంగల్‌లో గాదం మానస అత్యాచారం, హత్యల నేపథ్యం, ముగ్గురు బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడి అతి దారుణంగా హత్యలు చేసిన నిందితుడు సైకో మర్రి శ్రీనివాస్‌రెడ్డికి శిక్ష పడడంలో జరుగుతున్న జాప్యంపై మండల ప్రజలు గుర్రుగా ఉన్నారు. మర్రి శ్రీనివాస్‌ రెడ్డికి ఇప్పటికే కఠిన శిక్షలు ఖారారు అయితేనైనా నేరం చేసే వారికి వెన్నులో వణుకు పుట్టేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామంలో ఎవ్వరిని కదిలించినా సైకో శ్రీనివాస్‌ రెడ్డి దారుణాలనే గుర్తు చేసుకుంటు న్నారు. కొందరు మహిళలు కంటతడి పెడుతూ మర్రి శ్రీనివాస్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో యువతులపై జరుగుతున్న దారుణాలపై హాజీపూర్‌ గ్రామంలో ప్రజలందరూ శ్రీనివాస్‌రెడ్డి అకృత్యాలపై చర్చించుకుంటున్నారు. నేరాలకు పాల్పడే వారిపై చట్టాలు కఠినంగా లేకపోవడంతోనే నేరాలు పెరుగుతున్నాయి. ఇతర దేశాల మాదిరిగా నేరం చేసిన వారికి తక్షణమే శిక్షలు పడే వ్యవస్థ రావాలి. కోర్టులు, పోలీసులు విచారణలంటూ జాప్యం చేస్తే చట్టంలో ఉన్న లోసుగులు నేరస్తులకు తప్పించుకునే వెసులుబాటు దొరుకుతుంది. హాజీపూర్‌ కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఇప్పటికే శిక్ష పడితే ఇతర ప్రాంతాల్లో నేరం చేయాలనే వ్యక్తులకు కనువిప్పు కలిగేది.