అటవీ భూమలపై హక్కులను ఇవ్వాలి

వరంగల్‌,జనవరి3(జ‌నంసాక్షి): ఆదివాసీ గిరిజనులు సాగుచేస్తున్న అటవీ భుములకు హక్కుపత్రాలు ఇవ్వాలని గిరిజన ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. అటవీ భూమలుపై అర్హులైన వారికి హక్కులు కల్పిస్తామన్న సిఎం కెసిఆర్‌ హావిూ మేరకు హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుప్రకారం 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ గిరిజనుల భూములు, 1/70 వంటి చట్టాల విషయంలో మార్పుచేసే అధికారం ఎవరికీ లేదన్నారు. అడవులే ఆధారంగా బతికే ఆదివాసీలకు దానిపై హక్కు లేకుండా కొందరు కుట్ర చేస్తున్నారని అన్నారు. తరతరాలుగా పోడువ్యవసాయం చేస్తున్న ఆదివాసీ గిరిజనులకు అటవీ భుములపై హక్కు కల్పించాలనే సదాశయంతో కేంద్ర ప్రభుత్వం 2006లో అటవీ హక్కుల చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఆ చట్టం ప్రకారం 2006కు ముందుగా అటవీ భుములు సాగుచేస్తున్న వారికి అధికారాలు దఖలుపడతాయని అన్నారు. ఇవన్నీ తెలిసీకూడా  తప్పుడు ప్రకటనలు చేయడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి  హక్కులు కల్పించాలని  కోరుతున్నారు. ఇదిలావుంటే ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని అఖిలభారత షెడ్యూల్డ్‌కులాలు, జాతుల హక్కుల పరిరక్షణ సమితి నేతలు డిమాండ్‌ చేశారు.  ఇన్నేళ్లు గడిచినా ఎస్సీ,ఎస్టీలు అభివృద్ధికి నోచుకోవడం లేదని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వశాఖల్లో వీరికి పదోన్నతులు కల్పించాలని స్పష్టం చేశారు. బ్యాక్‌పోస్టుల భర్తీ, ఆయాశాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఒప్పంద, సీఆర్‌టీలను క్రమబద్ధీకరించాలని పేర్కొన్నారు. నిరుద్యోగ ఎస్సీ,ఎస్టీ యువతకు జీవనభృతి అందజేయాలని కోరారు.