జాడలేని వర్షాలతో నోళ్లు తెరిచిన చెరువులు

ఆదిలాబాద్‌,జులై4(జ‌నంసాక్షి): వర్షకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ చెప్పుకోదగ్గ రీతిలో వర్షం కురవక పోవడంతో జిల్లాలోని చెరువులు, వాగుల్లో నీరు ఇంకా చేరలేదు. అన్ని ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు నీరు చేరక బోసిగా కనిపిస్తున్నారు. వాగులు కూడా నీటి ప్రవాహానికి నోచుకోకా బోసిపోయి కనిపిస్తున్నాయి. గడిచిన నాలుగు సంవత్సరాలలో జూన్‌ మాసం చివరి నాటికి చెరువులు, కుంటలు వర్షపు నీటి చేరికతో సగానికి పైగా నిండే పరిస్థితి ఉండేది. వాగులు, వంకలలో నీటి ప్రవాహం కొనసాగేది. ఈ ఏడాది గడిచిన కాలాలకు భిన్నంగా కనిపిస్తుండడం అన్నదాతలను కలవరప రుస్తోంది. పంట కాలం అయిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు.ప్రతికూల పరిస్థితులతో అన్న దాతలు ఆందోళన చెందుతున్నారు. వరణుడి కరుణ కో సం ఎదురు చూస్తున్నారు. వర్షకాలం ప్రారంభ సూచికగా మృగశిర కార్తె సమయంలో, అటు తర్వాత మరో పది రోజుల పిదప కరుణించిన వరణుడు అనంతరం ముఖం చాటేయడంతో రైతన్నలు పరేషాన్‌ అవుతున్నారు. జిల్లా పరిధిలో జూన్‌ మాసంలో ఒక్క మండలంలో కూడా ఆశించిన మేర వర్షాలు కురియలేదు. అన్ని మండలాల్లో సాధారణ స్థాయి కంటే తక్కువగానే వ ర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌ సీజన్‌ మొదట్లోనే అన్నదాతలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.