సిఎం కెసిఆర్‌కు ప్రతి పథకంనైనా ఓ డ్రీమ్‌ ఉంది


దళిబంధుతో చరిత్రలో నిలచిపోతారు
బిజెపిలో చేరేవారంతా ఆర్థిక నేరగాళ్లే
విూడియా సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
హుజూరాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): దళితబంధు సభను జయప్రదం చేసినందుకు ప్రజలకు అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు తదితరులు ధన్యవాదాలు తెలిపారు. దళిత బంధు గొప్ప
పథకమని, దీన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. సీం కేసీఆర్‌ కు ప్రతి అంశంలో ఒక డ్రీమ్‌ ఉంటుందని చెప్పారు. బీజేపీలో చేరుతున్న వారంతా ఆర్థిక నేరాలు చేసినవాళ్లేనని, ఈటల రాజేందర్‌ కూడా దళితులకు సంబంధించిన భూములు తీసుకున్నట్టు ఒప్పుకున్నారని గుర్తుచేశారు.మంగళవారం హుజూరాబాద్‌ సిటీ సెంటర్‌లో ఆయనతో పాటు హన్మకొండ జడ్పీ చైర్మన్‌ మారెపల్లి సుధీర్‌ కుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, స్పోర్ట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ, జడ్పీటీసీ, హుజురాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గువ్వల మాట్లాడుతూ.. ’దళితులందరికి దళిత బంధు అందుతుంది. ఎవరికి ఆందోళన అవసరం లేదు, చివరికి ఉద్యోగులకు ఇస్తామని సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. హుజురాబాద్‌ దళిత కమ్యూనిటీ దేశానికి ఒక దిక్సుచిగా మారుతుంది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు దళిత బంధు గూర్చి మాట్లాడే అర్హత లేదు. దళిత బంధుతో ఆ పార్టీలు భయంలో పడ్డాయి’ అని అన్నారు. దళితుల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నంలో భాగమే దళిత బంధు అని చెప్పారు. ఇక్కడి ఒక నేత పదవిలో ఉన్నప్పుడు ఏ పనీ చేయకపోగా, ఆస్తులపై మమకారంతో వేరే పార్టీలోకి వెళ్లారని, దళితులు, బీసీ వర్గాల భూములు ఆక్రమించి, ధనార్జన పెంచుకున్నారని ఈటలపై విమర్శలు గుప్పించారు. ఈటల ఏ రోజు ప్రజలను పట్టించుకోలేదు, లెప్టిస్ట్‌ అయిన ఆయన బీజేపీలో చేరి హుజురాబాద్‌లో కలహాలు సృష్టించే నీచస్థాయికి దిగజారారు. ఇది బాధాకరం. ఉద్యమకారుడికి టికెట్‌ ఇచ్చినం. ఆయన కోసం ప్రతి దళిత కుటుంబం వద్దకు వెళ్లి ఓటు
కోరుతాం. దళితజాతిని రెచ్చగొడితే, దళితుల సత్తా ఏంటో చూపిస్తాం. గ్రామాల్లోని దళితుల్లో వెలుగులు నింపే ఈ పథకం అందరికి వర్తిస్తుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అందరూ సహకరించాలి’ అని గువ్వల విజ్ఞప్తి చేశారు. గెల్లు ఉద్యమకారుడని, ఆయన గెలుపును ఎవరు అడ్డుకోలేరని, హుజురాబాద్‌ అడ్డా టీఆర్‌ఎస్‌ అని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ అన్నారు. ఇక్కడ 2001 నుండి గులాబీ పార్టీ గెలుస్తుందని, ఇప్పుడూ తమదే విజయమని తెలిపారు. దళితబంధు సభకు 2 లక్షలకు పైగా ప్రజలు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. హన్మకొండ జడ్పీ చైర్మన్‌ మారెపల్లి సుధీర్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఈటల రాజేందర్‌ ను గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ఓడిరచబోతున్నారని స్పష్టంచేశారు.