రోహిత్‌ వేముల కేసు పునర్‌ విచారణ

తెలంగాణ పోలీసుల సంచలన నిర్ణయం
గత విచారణపై అనుమానం వ్యక్తి చేసిన వేముల ప్రశాంత్‌ తల్లి, సోదరుడు

రోహిత్‌ వేముల మృతి కేసులో తెలంగాణ పోలీసులు దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్టుపై రోహిత్‌ తల్లి, సోదరుడు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో, రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసు వివాదం మళ్ళీ ముదరడంతో తెలంగాణ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డిజిపి) రవి గుప్తా తదుపరి విచారణకు ఆదేశించారు. రోహిత్‌ ఆత్మహత్య కేసులో తెలంగాణ పోలీసుల క్లోజర్‌ రిపోర్టును చట్టపరంగా సవాలు చేస్తామని రోహిత్‌ వేముల కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. రోహిత్‌ సోదరుడు రాజా వేముల కుటుంబం షెడ్యూల్డ్‌ కులానికి సంబంధించి జిల్లా మేజిస్ట్రేట్‌ (డిఎం) ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, రోహిత్‌ వేముల కుటుంబం వ్యక్తం చేసిన అనుమానాన్ని ప్రస్తావిస్తూ, సంబంధిత కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని, తదుపరి విచారణకు అనుమతించాలని మేజిస్ట్రేట్‌ను కోరనున్నట్లు డిజిపి రవి గుప్తా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మరణించిన రోహిత్‌ వేముల తల్లి, మరికొందరు దర్యాప్తుపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడంతో, ఈ కేసులో మళ్ళీ దర్యాప్తు చేయాలని నిర్ణయించాం’ అని డీజీపీ గుప్తా అన్నారు.
ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసు విచారణను ముగిస్తున్నట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. రోహిత్‌ వేముల ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించారు. 2016లో రోహిత్‌ వేముల ఆత్మహత్యకు పాల్పడగా.. ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. దీంతో ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని తేల్చారు. అంతేకాదు.. రోహిత్‌ వేముల ఎస్సీ సామాజికవర్గానికి చెందిన యువకుడు కాదని కోర్టుకు సమర్పించిన రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అయితే, రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసును క్లోజ్‌ చేయడంతో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో కేసును మరోసారి దర్యాప్తు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.