ఔటర్‌పై రోడ్డు ప్రమాదం: చిన్నారి సహా భర్యాభర్తలు మృతి

హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): మేడ్చల్‌ జిల్లా కీసర ఔటర్‌ రింగ్‌రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఘటకేసర్‌ నుంచి కీసర వైపు అతి వేగంగా వస్తున్న కారు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న భార్యభర్తలు, వారి మూడు నెలల పసికందు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉప్పల్‌లోని అపోలో ఫార్మసీలో సెంట్రల్‌ మేనేజర్‌గా పని చేస్తున్న దినేశ్‌ కుమార్‌ తన భార్య సాగరిక మూడు నెలల బాబు రుషీకేశ్‌తో కారులో వెళ్తుండగా రాంపల్లి- దయార బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ఝార్ఖండ్‌ రాష్ట్రం జంషెడ్‌పూర్‌కు చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ పరిశీలించారు. ఈ కేసును కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.