కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ఉదయం కాకినాడలోని జీఎంఆర్ పవర్‌ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ప్లాంట్‌ మొత్తానికి విస్తరించాయి. దీంతో పవర్‌ప్లాంట్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు పడి ప్రమాదం చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం వల్ల ఎంతమేర నష్టం వాటిల్లిందనే విషయం తెలియాల్సి ఉంది.