తెరాసలోకి సునీతా లక్ష్మారెడ్డి!

– కేటీఆర్‌తో భేటీ అయ్యి పార్టీలో చేరికపై చర్చ
– ఏప్రిల్‌ 3న తెరాసలో చేరే అవకాశం
హైదరాబాద్‌, మార్చి26(జ‌నంసాక్షి) : తెలంగాణలో కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. సీనియర్‌ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌ బై చెబుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్‌ నేత సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు. సునీతా లక్ష్మారెడ్డి మంగళవారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసి.. పార్టీలో చేరికపై చర్చించారు. సీఎం కేసీఆర్‌ ఏప్రిల్‌ 3న మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని నర్సాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అదే సభలో సునీతా లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా పార్టీ తీరుపై సునీతా లక్ష్మారెడ్డి అసంతృప్తితో ఉన్నారట. మెదక్‌ నుంచి లోక్‌ ఎంపీగా పోటీ చేయాలని భావించారట. టికెట్‌ కోసం ప్రయత్నించినా అధిష్టానం స్పందించకపోవడంతో కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో సునీతా లక్ష్మారెడ్డి బీజేపీలో చేరతారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. కానీ బీజేపీని కాదని.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ వైపు అడుగులు వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా జారిపోతుంటే.. ఇటు పార్టీలో సీనియర్లు కూడా హ్యాండిస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరారు. అలాగే రాపోలు ఆనంద భాస్కర్‌, చిత్తరంజన్‌ దాస్‌లు పార్టీకి గుడ్‌ బై చెప్పారు. తాజాగా సునీతా లక్ష్మారెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.