నేతలందరినీ కలుపుకొని వెళ్తా

– మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
హైదరాబాద్‌, ఫిబ్రవరి19(జ‌నంసాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. ప్రమాణస్వీకారానికి ముందు ఆయన విూడియాతో మాట్లాడారు.. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలను అందరిని కలుపుకొని వెళతానని, జిల్లా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి భావోద్వేగానికి లోనయ్యారు.
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ మంత్రి పదవి ఇస్తానని చెప్పినప్పటికీ లక్ష్మీపార్వతి కారణంగా రాలేదని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత చంద్రబాబు మంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు.
కానీ సీఎం కేసీఆర్‌ మాత్రం తనకు ఇచ్చిన మాటను నిలుపుకున్నారని వ్యాఖ్యానించారు. వరంగల్‌ జిల్లాకు పెండింగ్‌లో ఉన్న రింగ్‌ రోడ్డు, టెక్స్‌ టైల్‌ పార్కు, ఎస్‌ఆర్‌ఎస్పీ నీళ్లు తేచ్చేందుకు కృషిచేస్తానని ఎర్రబెల్లి తెలిపారు. సీనియర్‌ నాయకులు కడియం శ్రీహరి, చందూలాల్‌, మధుసూదనాచారిలను కలుపుకుని ముందుకు పోతానన్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని అన్నారు. తనకు కేటాయించిన శాఖ ద్వారా రాష్ట్రంలో న్యాయం చేస్తానని, కేసీఆర్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఎర్రబెల్లి తెలిపారు.