పత్తిరైతుకు బోనస్‌ ఇచ్చి ఆదుకోవాలి: సీతక్క

వరంగల్‌,నవంబర్‌14 (జనంసాక్షి)  : పత్తి రైతులకు ఎక్కడా న్యాయం జరగడం లేదని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. పత్తి మార్కెట్లను సందర్శించి వివరాలు తెలుసుకున్నామని అన్నారు. ఎక్కడా గిట్టుబాటు ధరలు అమలు కావడం లేదన్నారు. వ్యవసాయ మార్కెట్లలో రైతుల పంటలకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులకు బోనస్‌ ఇచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. రైతులకు జరిగిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పత్తికి క్వింటాల్‌కు రు.6వేల మద్దతు ధర చెల్లించాలని అన్నారు. తాము ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ధర చెల్లిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్లకు వచ్చిన పత్తిలో కేవలం 1.2 శాతమే సీసీఐ కొనుగోలు చేస్తుందన్నారు. మిగతాదివ్యాపారులు, దళారులే కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. మరోపక్క మార్కెట్‌కు బస్తాలలో పత్తి తెస్తే కొనుగోలు చేయడం లేదని, లూజు పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామనడంతో అనేక మంది రైతులు మద్దతు ధర పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగినా మద్దతు ధరలు నామమాత్రంగా పెంచుతున్నారని తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు చేసే విషయంలో మార్క్‌ఫెడ్‌ అనేక కొర్రీలు పెడుతోందన్నారు. ఇప్పటికైనా సీసీఐ నిబంధనలను కొద్దిగా సడలించాలని కోరారు. రాష్ట్రంలో నకిలీ పత్తివిత్తన వ్యాపారులతో ప్రభుత్వం కుమ్మక్కైందని అన్నారు.