పార్టీలో ఉంటానా.. వీడుతానా అనేది.. కాలమే నిర్ణయిస్తుంది


– పార్టీ మారేందుకు మాత్రం ప్రయత్నించడం లేదు
– సంగారెడ్డి ప్రజల కష్టాలకు హరీష్‌రావే కారణం
– ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై కేసీఆర్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలి
– కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
హైదరాబాద్‌, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తల పట్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌ లోనే ఉంటానా? లేక టీఆర్‌ఎస్‌ లోకి వెళతానా? అనే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఇలాంటి పుకార్లను మాటిమాటికీ తాను ఖండించలేనని ఆయన అన్నారు.  సోమవారం ఆయన గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదని, ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నం టీఆర్‌ఎస్సే చేస్తోందని విమర్శించారు. పార్టీ మారడం ఎమ్మెల్యేల వ్యక్తిగత విషయమని, అయితే పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్‌ ను విమర్శించడం మాత్రం సరికాదని జగ్గారెడ్డి అన్నారు.
ఎమ్మెల్యేలకు ఉత్తమ్‌, భట్టి విక్రమార్క భరోసా కల్పిస్తున్నా పార్టీని వీడుతున్నారని జగ్గారెడ్డి తెలిపారు. పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న వారిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీ కేడర్‌ లో ఆత్మవిశ్వాసం దెబ్బతినదని చెప్పారు. సంగారెడ్డి తాగునీటి కష్టాలకు టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌ రావే కారణమని మండిపడ్డారు. హరీశ్‌రావుపై తనకు వ్యక్తిగతంగా కోపం లేదని, తన నియోజకవర్గ ప్రజలకు రావాల్సిన నీటిని తీసుకెళ్లారనే ఆయనపై విమర్శలు చేశానని చెప్పారు. ప్రజలకు కష్టాలు ఉన్నంత కాలం రాజకీయ నాయకులకు ఢోకా ఉండదని.. ప్రజల కష్టాలు తీరవు, నాయకుల ప్రాబల్యం తగ్గదని అన్నారు. ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలు బాధాకరమని చెప్పారు. బాధ్యాతారహితంగా వ్యవహరించిన అధికారులపై సీఎం కేసీఆర్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలను ఆపేందుకు అవసరమైన ప్రణాళికలు రూపకల్పన చేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని జగ్గారెడ్డి  డిమాండ్‌ చేశారు.