బీజేపీ, కాంగ్రెస్‌లకు కాలం చెల్లింది

– ప్రాంతీయ పార్టీల నాయకుడే ప్రధాని
– ఆ సత్తా ఒక్క కేసీఆర్‌కే ఉంది
– 2న వరంగల్‌లో కేసీఆర్‌ బహిరంగ సభ
– తెరాస శ్రేణులు బహిరంగ సభను విజయంతం చేయాలి
– బహిరంగ సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
వరంగల్‌, మార్చి26(జ‌నంసాక్షి) :  కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు కాలం చెల్లిందని, వారి పాలనల పట్ల ప్రజలు విసుగుచెందారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌లో ఏప్రిల్‌ 2న జరిగే సీఎం బహిరంగ సభా ఏర్పాట్లను మంత్రి మంగళవారం పరిశీలించారు. ఆజంజాహి మిల్లు మైదానంలో జరిగే టీఆర్‌ఎస్‌ సభ ఏర్పాట్లను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బహిరంగ సభకు రెండు లక్షల మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తునట్లు తెలిపారు. గతంలో ఇక్కడి సభలో పాల్గొన్న పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారన్నారు. ఈ సెంటిమెంట్‌ కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలకు పట్టకట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. ప్రాంతీయ పార్టీలను ఏకంచేసే కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 16ఎంపీ సీట్లను గెలిస్తే కేంద్రంలో కేసీఆర్‌ ప్రధాన భూమిక పోషిస్తారని, ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలనలో దేశ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ ఎన్నికలతో ఆ పార్టీలకు కాలం చెల్లిందని చెప్పారు. జిల్లాలో రోజూ మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరందించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని వెల్లడించారు. దేవాదుల, కాళేశ్వ రం ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో అన్ని చెరువులు నిత్యం మత్తడి పడేట్టు చేస్తామన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటూ, పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేసినవారి పిల్లలకు తగిన శిక్షణను ఇప్పించి ఉపాధి కల్పించేందుకు స్వయంగా ఉద్యోగమేళా నిర్వహిస్తానని హావిూ ఇచ్చారు.  ఏప్రిల్‌
2న కేసీఆర్‌ బహిరంగ సభలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని తెరాస అభ్యర్థి విజయాన్ని ఖాయం చేయాలని దయాకర్‌రావు పిలుపునిచ్చారు.