సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్దరణకు..
మార్గం సుగమం
– పునరుద్దరణకు లా ట్రిబ్యునల్ ఆమోదం
– సంబరాలు చేసుకున్న కార్మికులు
హైదరాబాద్, జులై19(జనం సాక్షి) : సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు పునరుద్ధరణకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. అనుకూలంగా తీర్పు రావడంతో కార్మికులు సంబురాలు చేసుకున్నారు. పటాసులు పేల్చి సందడి చేశారు. 2014 సెప్టెంబర్ 27న షట్ డౌన్ పేరుతో ఎస్పీఎం పేపర్ మిల్లును యాజమాన్యం మూసివేసింది. రూ. 420 కోట్ల నష్టాలు వచ్చాయని తెలిపింది. దీంతో రెండు వేల మంది
కార్మికులు, 1500 మంది కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం పలుసార్లు చర్చలకు ప్రయత్నం చేసినా యాజమాన్యం ముందుకు రాకపోవడంతో అప్పు ఇచ్చిన ఐడీబీఐ బ్యాంకు మిల్లును స్వాధీనం చేసుకుంది. గతేడాది ఫిబ్రవరిలో వేలం వేయగా జేకే యాజమాన్యం దక్కించుకుంది. అయితే కొందరు తమకు రావాల్సిన బకాయిల కోసం కోర్టుకు వెళ్లడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. చివరకు న్యాయస్థానం తీర్పుతో అడ్డంకులు తొలగిపోవడంతో మిల్లు ప్రారంభించేందుకు యాజమాన్యం ఓకే చెప్పింది. మిల్లును తెరిపించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎంతో ప్రయత్నం చేశారని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.