సుష్మా ప్రమాద బాధితులకు స్పీకర్‌ పరామర్శ

– వైద్య ఖర్చులు ప్రభుత్వం తరుపున భరిస్తామని హావిూ
హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : నగర శివారు వనస్దలిపురంలోని సుష్మ థియేటర్‌ సవిూపంలో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఎల్బీనగర్‌ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సునీల్‌ కుటుంబ సభ్యులను స్పీకర్‌ మధుసూదనాచారి పరామర్శించారు. ఈ ప్రమాదంలో సునీల్‌తో పాటు పెద్ద కుమారుడు మృతిచెందగా.. భార్య రాధ, చిన్న కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గురువారం ఆస్పత్రికి వచ్చిన స్పీకర్‌ బాధితులను పరామర్శించి.. ఈ ప్రమాదాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ కుటుంబాన్ని అదుకుంటామని హావిూ ఇచ్చారు. వారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు కారకుడైన టిప్పర్‌ డ్రైవర్‌ను
చట్టప్రకారం శిక్షిస్తామన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిర్లక్ష్యంగా, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఫలితంగా రోడ్డు ప్రమాదాలు తగ్గేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.