125 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

విజయనగరం,నవంబర్‌16(జ‌నంసాక్షి): రైతులు ధాన్యం విక్రయించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తామని పౌరసరఫరాల శాఖ డీఎం వెంకటేశ్వరరావు వివరించారు. జిల్లాలో ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుంచి ప్రతి గింజ కూడా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది 125 కొనుగోలు కేంద్రాలు తెరుస్తామన్నారు. గతేడాది మాదిరిగా కాకుండా త్వరితగతిన కొనుగోలు కేంద్రాలను తెరిచి, రైతుల నుంచి

ప్రతి చివరి గింజను కూడా కొంటామన్నారు. ఈ మేరకు గురువారం నుంచి ఆమదాలవలస, రాజాం, పలాసలలో సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే కొనుగోలు కేంద్రాలకు అవసరమయ్యే సామగ్రిని కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 2.12 హెక్టార్లలో వరి సాగు కాగా, మంచి దిగుబడులు లభించనున్నాయని, తద్వారా 10.81 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి కానుందన్నారు. ఇందులో 1.80 లక్షల మెట్రిక్‌ టన్నులు సాంబ రకం ఉత్పత్తి కానుందన్నారు.