రేణుకకు తెలంగాణ సెగ

తిక్కమాటలను నిరసిస్తూ ఘెరావ్‌
హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి మరోసారి తెలంగాణ సెగ తాకింది. ఆమె మంగళవారం ఢిల్లీ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి బయటకు రాగానే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న తెలంగాణవాదులు చుట్టుముట్టారు. పెద్ద ఎత్తున తెలంగాణకు అనుకూలంగా, రేణుకకు వ్యతిరేకంగా ‘గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. దీనిపై రేణుక తీవ్ర ఆగ్రహం వ్యక్త చేసింది. ‘పిచ్చి కుక్కల్లారా అరవకండి’ అంటూ బూతులు తిడుతూ ఆమె తెలంగాణవాదులపై మండిపడ్డారు. దీనికి తెలంగాణవాదులు కూడా అదే స్థాయిలో స్పందించారు. రేణుక తెలంగాణ ద్రోహి అంటూ నినదించారు. దీంతో కంగుతిన్న రేణుక నేను కూడా తెలంగాణ బిడ్డనే అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెలంగాణవాదులు మాత్రం నువ్వు తెలంగాణ బిడ్డవైతే ఇంతకాలం ఎందుకు పోరాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు తెలంగాణవాదులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వదిలిపెట్టారు.