కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టాల రూపకల్పనపై సీఎం సమీక్ష

గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల్లో అవినీతిని రూపుమాపి.. ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాలను రూపొందించడంపై సీరియస్ గా దృష్టి పెట్టారు. అందులో భాగంగానే కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాల రూపకల్పనపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కెటి రామారావు, బాల్క సుమన్, వివేకానంద గౌడ్, ఎంపిలు బిబి పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ ఎస్.కె.జోషి, సీనియర్ ఐఎఎస్ అధికారులు ఎస్.నర్సింగ్ రావు, సునిల్ శర్మ, అరవింద్ కుమార్, నీతూ ప్రసాద్, స్మితాసభర్వాల్, న్యాయ కార్యదర్శి నిరంజన్ రావు ఈ రివ్యూలో పాల్గొన్నారు.

ప్రజా ప్రతినిధులు, అధికారులకు ప్రజలకు మంచి సేవలు అందించడం కన్నా గొప్ప బాధ్యతలేవీ లేవన్నారు సీఎం కేసీఆర్. ప్రజలు ఎవరికీ ఎక్కడా ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా పని జరగాలన్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో, మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో డబ్బులు ఇవ్వకుండా, ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కావాల్సిన పనులు జరగాలన్నారు. దీనికోసం కఠినమైన కొత్త చట్టాలు తేవాలన్నారు. రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యం వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని పనిచేసే పాలనా విభాగాలుగా తీర్చిదిద్దాలన్నారు. జిల్లా పరిషత్ లకు, మండల పరిషత్ లకు కూడా తమ విధుల విషయంలో స్పష్టత ఇవ్వాలన్నారు. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకుని..  పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. ఆయా కార్యాలయాల్లో అవినీతి లేకుండా ప్రజలకు పని కావడంతోనే ఈ సంస్కరణల లక్ష్యం నెరవేరుతుందన్నారు సీఎం కేసీఆర్. ప్రజల నుంచి తనకు వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు సీఎం కేసీఆర్.  లంచం ఇవ్వకుంటే పనులు కావట్లేదని మొరపెట్టుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎందుకు తిట్లు పడాలని ప్రశ్నించిన ముఖ్యమంత్రి.. ప్రజలు లంచాలివ్వాల్సిన పరిస్థితి ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే లంచాలు లేని వ్యవస్థను తీసుకురావాలన్నారు. ఇందుకోసం పటిష్టమైన చట్టాలు రూపొందించి, పకడ్బందీగా అమలు చేయాలన్నారు. రెవెన్యూలో, రిజిస్ట్రేషన్లలో, మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో ఒక్క పైసా ఇవ్వకుండా పనులు జరిగే పరిస్థితులు రావాలన్నారు. ఇందుకోసం ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు..

జిల్లా ముఖ్య పరిపాలనాధికారి సారథ్యంలో..  సీనియర్ అధికారుల నాయకత్వంలో జిల్లా స్థాయిలో పటిష్టమైన అధికారిక వ్యవస్థ ఉండాలన్నారు సీఎం కేసీఆర్. భూమిశిస్తులు, నీటి తీరువా వసూలు చేసినప్పుడు కలెక్టర్ అనే పదం పుట్టిందని గుర్తు చేశారు. ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నారని చెప్పారు. మారిన పరిస్థితుల్లో ఇంకా కలెక్టర్ అనే పిలవాలా? లేక జిల్లా పరిపాలనాధికారి అనే పేరు పెట్టాలా? అని ఆలోచించాలన్నారు. కలెక్టర్ లేదా జిల్లా పరిపాలనాధికారి ఆధ్వర్యంలో ఐదారుగురు ముఖ్యమైన అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. వారికి కొన్ని నిర్థిష్ట శాఖలు అప్పగించాలన్నారు. జిల్లా స్థాయిలో ముఖ్యమైన పనులన్నీ ఐఎఎస్ అధికారి నాయకత్వంలోని అధికారుల బృందం పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం, ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సేవలు అందించడం, అవినీతికి, అలసత్వానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడం ఈ అధికారి బాధ్యత అని సూచించారు. కలెక్టర్ లేదా పరిపాలనాధికారి, అడిషనల్ కలెక్టర్ లేదా అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్..  విధులు, బాధ్యతలను నిర్ధిష్టంగా పేర్కొనాలన్నారు సీఎం. లే అవుట్ల అనుమతులు, ఆస్తుల అంచనాలు (ప్రాపర్టీ అసెస్మెంట్స్) తదితర పనులు ఐఎఎస్ అధికారి నాయకత్వంలోని బృందం చేయాల్సి ఉంటుందన్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లాగా తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ను నెలకొల్పి… రాష్ట్రంలోని స్థితిగతులకు అనుగుణంగా పాలన సజావుగా సాగే ప్రక్రియను ప్రవేశ పెట్టే అవకాశాలను పరిశీలించాలన్నారు సీఎం కేసీఆర్.

జిల్లా స్థాయిలో ఐఎఎస్ అధికారి నాయకత్వంలో అధికార యంత్రాంగం ఏర్పడినట్లే,..  రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో ముఖ్యమైన అధికారుల వ్యవస్థ ఏర్పడాలన్నారు సీఎం కేసీఆర్. సిఎస్ ఆధ్వర్యంలో అడిషనల్ సిఎస్ లను నియమించాలన్నారు. వారికి శాఖలు అప్పగించాలన్నారు. జిల్లా స్థాయిలో ఐఎఎస్ అధికారి నాయకత్వంలో పనిచేసే బృందం పనితీరును.. సిఎస్ నాయకత్వంలోని బృందం పర్యవేక్షించాలన్నారు. ఎప్పటికప్పుడు కావాల్సిన నిర్ణయాలను ఈ బృందం తీసుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు , గ్రామ పంచాయతీలు పారిశుధ్యం, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉందన్నారు సీఎం కేసీఆర్. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో విధిగా వైకుంఠధామం నిర్మించాలన్నారు. నర్సరీ ఏర్పాటు చేయాలన్నారు. అనుమతులు, సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి అలసత్వం ఉండకూడదన్నారు. ఆలస్యానికి కారకులైన అధికారులపై జరిమానా విధించే పద్ధతి రావాలన్న ముఖ్యమంత్రి… ప్రజలకు జవాబుదారీగా అధికార యంత్రాంగం ఉండాలన్నారు. ఇవన్ని అంశాలు కొత్తగా రూపొందించే చట్టంలో పొందుపరచాలని సూచించారు సీఎం కేసీఆర్.

తెలంగాణలో పట్టణ జనాభా బాగా పెరుగుతున్నదన్నారు సీఎం కేసీఆర్. పట్టణాల్లో ఏర్పడే అవసరాలను తీర్చే విధంగా తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలన్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించిన జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏలకు ప్రత్యేక విధానం రూపొందించాలన్నారు. ఇతర పట్టణాలు, నగరాలను ఎలా తీర్చిదిద్దాలనే విషయంపై తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలన్నారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకుని, దానికి అనుగుణమైన విధాన రూపకల్పన జరగాలన్నారు సీఎం కేసీఆర్.