బ్రహ్మాస్త్రా సెట్స్‌లో రాష్ట్రపతి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి): బల్గేరియాలో షూటింగ్‌ జరుపుకుంటున్న బ్రహ్మాస్త్రా సెట్స్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు అనుకోని అతిథిగా కనిపించారు.  బ్రహ్మాస్త్రా చిత్ర షూటింగ్‌ బల్గేరియాలో జరుగుతుందని తెలుసుకున్న రాష్ట్రపతి..బల్గేరియా ప్రెసిడెంట్‌ రాదేవ్‌తో కలిసి బ్రహ్మాస్త్రా సెట్స్‌ని సందర్శించారు. టీం అందరితో కలిసి మాట్లాడారు. బ్రహ్మస్త్రా షూటింగ్‌ జరుగుతున్న సోషియా స్టూడియోని మొత్తం సందర్శించారు. ప్రెసిడెంట్స్‌ ఇద్దరు నటీనటులతో కలిసి ఫోటోలు దిగారు. రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌, మౌనీరాయ్‌ , నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలలో అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న చిత్రం బ్రహ్మస్త్రా. కరణ్‌జోహార్‌ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం బల్గేరియాలో షూటింగ్‌ జరుపుకుంటుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మూడు రోజుల పర్యటన నిమిత్తం యూరప్‌ వెళ్ళారు. ఈ క్రమంలో బల్గేరియా కూడా సందర్శించారు. ఆ ఫోటోలని ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా తమ అఫీషియల్‌ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. సినిమా అనేది రెండు దేశాల మధ్య బిజినెస్‌, కల్చరల్‌ లింక్‌ అవుతుందని ఇరుదేశాల అధ్యక్షులు ఆశాభావం వ్యక్తం చేసినట్టు రాష్ట్రపతి కార్యాలయం తమ ట్విట్టర్‌లో పేర్కొంది.