మేఘాలయ బొగ్గుగనిలో..  మృతదేహం గుర్తింపు


– 160అడుగుల లోతులో మృతదేహాన్ని వెలికితీత
– మిగిలిన 14మంది కార్మికుల కోసం ముమ్మర గాలింపు
న్యూఢిల్లీ, జనవరి17(జ‌నంసాక్షి) : మేఘాలయ బొగ్గుగనిలో చిక్కుకుపోయిన కార్మికులకోసం నెలరోజులుగా సహాయక చర్యలు సాగుతున్నాయి. ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్న నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గురువారం ఉదయం ఓ కార్మికుడి మృతదేహాన్ని గుర్తించారు. దాదాపు 160 అడుగుల లోతులో నేవీ సిబ్బంది ఈ మృతదేహాన్ని గుర్తించి గని పైకి తీసుకొచ్చారు. అయితే పోస్టుమార్టం తర్వాతే పూర్తి వివరాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
మేఘాలయలోని తూర్పు జయంతియా జిల్లాలో డిసెంబరు 13న 15 మంది కార్మికులు బొగ్గు గనిలోకి వెళ్లి చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దట్టమైన చెట్లతో కూడి ఉన్న కొండపై ఉండే ఎలుక బొరియల్లో అక్రమంగా బొగ్గు తవ్వేందుకు కూలీలు లోపలికి వెళ్లగా.. పక్కనే ప్రవహిస్తున్న లిటిల్‌ నది నీరు గనిలోకి ముంచెత్తడంతో 15మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. వీరిలో కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, వైమానిక దళం, అగ్నిమాపక దళం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అయితే గనిలో నీరు ఎక్కువగా ఉండటంతో సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. గనిలో దాదాపు 370 అడుగుల లోతు నుంచి నీటికి బయటకు పంపడం కష్టంగా మారింది. దీంతో కార్మికుల ఆచూకీ కనిపెట్టడం ఆలస్యమైంది. ఇప్పటికే కార్మికులు గనిలో చిక్కుకుని నెల రోజులు గడిచిపోవడంతో వారు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.