యూపీలో 60 ఏళ్ల వృద్ధురాలి దారుణ హత్య

– 10 బుల్లెట్లు దించిన దుండగులు
– సీసీ కెమెరాల్లో రికార్డయిన ఘటన
– విచారణ చేపట్టిన పోలీసులు
లక్నో,జనవరి25(జ‌నంసాక్షి) : ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు దుండగులు తల్లీ కొడుకులపై కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకెళితే.. విూరఠ్‌ ప్రాంతానికి చెందిన నిచేత్తర్‌ కౌర్‌ అనే 60 ఏళ్ల వృద్ధురాలు మరో మహిళలతో కలిసి మంచంపై కూర్చుని కబుర్లు చెప్తోంది. ఇంతలో ఉన్నట్టుండి ముగ్గురు వ్యక్తులు తుపాకులతో వచ్చి నిచేత్తర్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆమె శరీరంలోకి ఏకంగా పది బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. దుండగులు అంతటితో ఆగకుండా ఆమె కుమారుడిని కూడా హత్య చేసి మృతదేహాన్ని ఊరి చివరిలోని ఓ కారులో దాచారు. మృతురాలి పక్కనే ఉన్న మహిళను మాత్రం పారిపోమన్నారు. ఈ దారుణమంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరూ గుర్తుపట్టకుండా దుండగులు ముసుగులేసుకున్నారు. 2016లో నిచేత్తర్‌ కౌర్‌ భర్తను భూ వివాదం నేపథ్యంలో హత్యకు గురయ్యాడు. ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పడానికి గురువారం నిచేత్తర్‌, కుమారుడు బల్వీందర్‌ న్యాయస్థానంలో హాజరుకావాల్సి ఉంది. కోర్టుకు హాజరవడానికి ఒక్కరోజు ముందు ఇద్దరూ హత్యకు గురికావడంతో ప్రత్యర్థులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా మిగతా నిందితుల కోసం గాలింపులు చేపడుతున్నారు.