నా కుమారుడిని విచారించండి

– ప్యారడైజ్‌ పత్రాల్లో ఉన్నవారిని ఎవ్వరినీ వదలొద్దు

– మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా

న్యూఢిల్లీ,నవంబర్‌ 10,(జనంసాక్షి): వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలు చేసిన మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్యారడైజ్‌ పత్రాల్లో తన కుమారుడు, కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా పేరు ఉండటంపై ప్రభుత్వం తప్పకుండా విచారణ జరపాల్సిందిగా డిమాండ్‌ చేశారు. ప్యారడైజ్‌ పత్రాల్లో ఏయే రాజకీయ నేతల పేర్లు బయటకు వచ్చాయో వారిందరిపైనా విచారణ జరపాలి. 15రోజులు లేదా నెల రోజుల్లో వారిని విచారించాలి. ఎవరినీ వదిలి పెట్టకుండా.. నా కుమారుడు జయంత్‌ సిన్హాతో పాటు జై షా కేసును కూడా విచారించాలి’ అని యశ్వంత్‌ సిన్హా ఓ ఆంగ్ల విూడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. దీంతో పాటు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడు జై షా కేసుపై విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. భాజపా అధికారంలోకి వచ్చాక జైషా కంపెనీ ఆస్తులు 16వేల రెట్లు పెరిగాయని ఆరోపిస్తూ ది వైర్‌ అనే వెబ్‌సైట్‌లో ఇటీవల ఓ కథనం వచ్చింది. దీనిని సవాల్‌ చేస్తూ జై షా రూ.100కోట్ల పరువు నష్టం దావా వేశారు. విదేశాల్లో మూడో కంటికి తెలియకుండా అనేక మంది పెద్దలు పెట్టిన పెట్టుబడులు, పన్నుల ఎగవేతలు, డొల్ల కంపెనీల స్థాపనలు, ఇతర వ్యవహారాలకు సంబంధించి పార్యడైజ్‌ పత్రాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌మాల్యా, కేంద్రమంత్రి జయంత్‌ సిన్హాతో పాటు పలువురు పేర్లు ఉన్నట్లు వెల్లడైంది.