విజృంభించిన విష జ్వరాలు

విజయవాడ, జూలై 20 : బావులపాడు మండలం అగిశంపాడు గ్రామంలో విషజ్వరాలు విజృంభించాయి. ఈ విష జ్వరాల బారినపడి ఇప్పటికే ఇద్దరు మృతి చెందినప్పటికీ అధికార యంత్రాంగంలో స్పందన కరువైంది. మరో 50 మంది విషజ్వరాలతో మంచమెక్కారు. విషయం తెలుసుకున్న జిల్లా టిడిపి అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించి డిఎం అండ్‌ హెచ్‌వోకు అదేశాలు జారీ చేశారు. శనివారం నాటి ప్రత్యేక వైద్య బృందాలను ఆ గ్రామానికి పంపుతామని, జ్వరాలు అదుపులోకి వచ్చే వరకు బృందాలు అక్కడే ఉంటాయని డిఎంహెచ్‌వో శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.