సబ్‌మెరైన్లు, యుద్ధనౌకల సమాచారం పాక్‌కు చేరవేత

` గూఢచర్యం కేసులో ఇంజినీర్‌ అరెస్టు
న్యూఢల్లీి(జనంసాక్షి): పాకిస్థాన్‌ తరఫున గూఢచర్యం చేస్తూ.. భారత్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని శత్రువులకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై మహారాష్ట్రలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.అమ్మాయి వలపు వలలో చిక్కిన అతడు.. మన యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అందించినట్లు విచారణలో వెల్లడైంది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. థానేలోని కల్వానికి చెందిన రవీంద్ర వర్మ(27) మెకానికల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 2024లో పాయల్‌ శర్మ, ఇస్ప్రీత్‌ అనే పాకిస్థాన్‌ ఏజెంట్‌లతో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఆ ఏజెంట్లు తమని తాము భారత్‌కు చెందినవారిగా పరిచయం చేసుకున్నారు. ఓ ప్రాజెక్టు విషయంలో యుద్ధనౌకల సమాచారం కావాలని వర్మను కోరారు. అలా కొన్ని రోజులు వారి మధ్య సంభాషణలు సాగాయి. అలా భారత్‌కు చెందిన యుద్ధనౌకల నుంచి, సబ్‌మెరైన్లకు సంబంధించిన సమాచారాన్ని వర్మ వారికి చేరవేశాడు. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే, పాక్‌ ఏజెంట్‌లని తెలిసే ఆయా వివరాలను పంచుకున్నాడు. దీనికి బదులుగా అతడి బ్యాంకు ఖాతాలోకి పెద్ద మొత్తంలో డబ్బు జమయ్యింది.వర్మ ఒక రక్షణ సాంకేతిక సంస్థలో జూనియర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో అతడికి దక్షిణ ముంబయిలోని నావల్‌ డాక్‌యార్డ్‌కు వెళ్లేందుకు అవకాశం ఉంది. అంతేకాక.. అతడు నావల్‌ షిప్‌లు, సబ్‌మెరైన్లలో కూడా ప్రయాణించవచ్చు. అయితే, నావల్‌ డాక్‌యార్డ్‌లోకి ఫోన్‌ తీసుకెళ్లేందుకు అనుమతి ఉండదు. దీంతో అతడు అక్కడి విషయాలను స్కెచ్‌ల రూపంలో పంచుకునేవాడు. మరికొన్నిసార్లు ఆడియో నోట్స్‌ను వినియోగించాడు.నిందితుడు ఆ సబ్‌మెరైన్‌, యుద్ధనౌకల పేర్లను కూడా పాకిస్థాన్‌ ఏజెంట్‌లతో పంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వర్మను కోర్టులో హాజరుపరచగా.. యాంటీ టెర్రరిస్ట్‌ స్వ్కాడ్‌ కస్టడీకి అప్పగించింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.