వెనుకబడిన వర్గాల సంక్షేమానికి పథకాలు రూపొందిస్తున్నాం
` ఆయా వర్గాలకు రాజకీయ అధికారం కల్పించేందుకు చిత్తశుద్ధితో ఉన్నాం
: భట్టి విక్రమార్క
పాల్వంచ(జనంసాక్షి): ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.ఆయా వర్గాలకు రాజకీయ అధికారం కల్పించేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్వహించిన ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దేశంలోని అన్ని రకాల వనరులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వాలనేది కాంగ్రెస్ లక్ష్యమన్నారు.
‘’వెనుకబడిన వర్గాలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను రూపొందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం భూగరిష్ఠ పరిమితి చట్టం చేసింది. భూమిలేని ఎస్సీ, ఎస్టీలకు భూములు పంపిణీ చేసింది. 6.70 లక్షల ఎకరాలను కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసింది. పేదలకు పంచిన భూములను వారు దున్నుకోకుండా భారాస ప్రభుత్వం అడ్డుకుంది. గిరిజనుల భూమికి సాగునీటి కోసం ‘ఇందిరా సౌర గిరిజల వికాసం’ పథకాన్ని ప్రారంభించాం. దీనికోసం రూ.12,500 కోట్లు కేటాయించాం. 2013లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే’’ అని భట్టి విక్రమార్క వివరించారు.