వైసీపీ పైశాచికత్వం ఏమాత్రం తగ్గలేదు: ఎక్స్ లో మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం

ప్రజలు తిరస్కరించినా వైసీపీ తీరు మారలేదని, ఆ పార్టీ కార్యకర్తల పైశాచికత్వం తగ్గలేదని మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నంలో వైసీపీ కార్యకర్తల పిచ్చి చేష్టలకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేస్తూ లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌ ఇంట్లో జరిగిన శుభకార్యానికి వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ నివాసం ఉన్న మార్గంలో వెళుతున్న ఓ బాలుడి సైకిల్‌ ను వైసీపీ కార్యకర్తలు లాక్కున్నారు.సైకిల్‌ను గాల్లో తిప్పి.. నేలకేసి కొట్టి కాళ్లతో తొక్కుతూ పైశాచిక ఆనందం పొందారు. ఈ చర్యలతో భయపడిన బాలుడు ఏడుస్తున్నా వారు పట్టించుకోలేదు. సెల్ ఫోన్ కెమెరాలలో రికార్డు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను మంత్రి లోకేశ్ రీట్వీట్ చేస్తూ.. ‘‘అబ్బే.. వాళ్లేమీ మారలేదు. మారరు కూడా. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో కానీ ఆ పేరును సార్థకం చేసుకోవడానికి నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. అందుకే నాటికీ, నేటికీ, ఎప్పటికీ అదో సైకో పార్టీనే.. వాళ్ల నాయకుడు ఓ సైకో! ప్రజలు బుద్ధి చెప్పినా మారని వాళ్ల ఆలోచనలను, చిన్న పిల్లవాడి చేతి నుంచి సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ, విరగ్గొడుతూ చేస్తున్న వికృత చేష్టలను సమాజం మరింతగా అర్థం చేసుకోవాలని ఈ వీడియోను పోస్ట్‌ చేస్తున్నాను’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

తాజావార్తలు