నిప్పుతో ఆడుకోవద్దంటూ అమెరికాకు చైనా వార్నింగ్

తైవాన్ వ్యవహారం తమ అంతర్గత విషయమని, ఈ విషయంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవద్దని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేశారు. తైవాన్ అంశాన్ని అమెరికా తెరపైకి తీసుకురావడం సముచితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నిప్పుతో చెలగాటమాడవద్దని అమెరికాకు గట్టి హెచ్చరిక చేశారు.సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సులో హెగ్సెత్ మాట్లాడుతూ, భౌగోళిక, సముద్ర వివాదాల పరిష్కారంతో పాటు తైవాన్ విషయంలో చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. తైవాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి చైనా దాని చుట్టూ సముద్ర జలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలను మోహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.చైనా నుంచి ఆర్థిక, సైనిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఇండో-పసిఫిక్ ప్రాంత మిత్ర దేశాలను విస్మరించబోమని పేర్కొంటూ, ఆయా దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలని హెగ్సెత్ సూచించారు. హెగ్సెత్ చేసిన ఈ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తీవ్రంగా స్పందిస్తూ అమెరికాను హెచ్చరించారు.

తాజావార్తలు