భారత్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే..

` అది ఎంతో దూరంలో లేదు: ట్రంప్‌
వాషింగ్టన్‌(జనంసాక్షి): భారత్‌తో వాణిజ్యఒప్పందం కుదిరే సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. న్యూదిల్లీపై ట్రంప్‌ దాదాపు 26శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఒక ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఈక్రమంలోనే ఎయిర్‌ఫోర్స్‌వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు భారత్‌తో టారిఫ్‌ చర్చలు గొప్పగా జరుగుతున్నాయని ట్రంప్‌ తెలిపారు. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నామన్నారు. అంతేకాకుండా భారత్‌- పాక్‌లు ఘర్షణలకు దిగితే వారితో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలనే ఆసక్తి తనకు పోతుందని వ్యాఖ్యానించారు. ఈసందర్భంగా వాణిజ్య చర్చలు జరిపేందుకు పాకిస్థాన్‌ ప్రతినిధులు కూడా వచ్చేవారం వాషింగ్టన్‌కు రానున్నట్లు తెలిపారు.కాగా.. ఇప్పటికే ఇరుదేశాల మొదటి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌తో సమావేశమయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరు నాటికి తొలి దశ ఒప్పందాన్ని ఖరారు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా పరస్పర మార్కెట్ల వినియోగం.. స్థానిక నిబంధనల అమలు, టారిఫ్‌ మినహాయింపులకు పరిమితులపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో ట్రంప్‌ పలు దేశాలపై టారిఫ్‌ల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే 90 రోజుల పాటు ఈ సుంకాల అమలుకు అమెరికా విరామం ప్రకటించింది. ట్రంప్‌ విధించిన సుంకాలపై చాలా దేశాలు ప్రతీకార చర్యలకు దిగాయి. అయితే, భారత్‌ మాత్రం విభిన్నంగా ఆలోచించి.. ప్రతికార సుంకాలకు బదులుగా అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టిసారించింది. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అడుగులు పడిన సంగతి తెలిసిందే. పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకునేలా దేశాధినేతలు అంగీకారం తెలిపారు. ఈనేపథ్యంలోనే చర్చలు జరుగుతున్నాయి.