ఫైటర్జెట్లను కోల్పోయాం
` ఎన్ని కోల్పోయామన్నది కాదు.. ఎందుకు కోల్పోయామన్నది ముఖ్యం
` పైలెట్లు మాత్రం సురక్షితంగా తిరిగివచ్చారు
` ధృవీకరించిన సీడీఎస్ అనిల్ చౌహాన్
` తప్పులను సరిదిద్దుకుంటాం.. ధీటుగా స్పందిస్తాం
` సవాళ్లు అధిగమించి దాడులు చేశాం
` ఆరు యుద్ధవిమానాలను కూల్చేసినట్లు పాక్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం
` పోరాటంలో నష్టం జరగడం సాధారణమేనని వెల్లడి
సింగపూర్(జనంసాక్షి):పాకిస్థాన్తో ఇటీవల జరిగిన ఘర్షణల్లో భారత వాయుసేనకు కొన్ని సవాళ్లు ఎదురైన మాట వాస్తవమేనని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. అయినప్పటికీ వెంటనే వాటిని అధిగమించి.. శత్రుమూకలపై తీవ్రంగా విరుచుకుపడ్డామని అన్నారు. ఈ క్రమంలో కొంత నష్టం ఏర్పడిన మాట వాస్తవమేనన్నారు. అయితే, ఆరు జెట్లను కూల్చేసినట్లు పాక్ చేస్తున్న వాదన మాత్రం పూర్తిగా తప్పు అని సీడీఎస్ స్పష్టం చేశారు.సింగపూర్లో జరుగుతున్న షాంగ్రీ-లా డైలాగ్లో సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘యుద్ధవిమానం కూలిపోవడమనేది ముఖ్య విషయం కాదని అనుకుంటున్నా. అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడమే ముఖ్యం. మావైపు జరిగిన వ్యూహాత్మక తప్పిదాలను వెంటనే గుర్తించాం. వాటిని సరిదిద్దుకొని రెండు రోజుల్లోనే మళ్లీ దాన్ని విజయవంతంగా అమలుచేశాం. సుదీర్ఘ లక్ష్యాలను పెట్టుకొని ఆ దిశగా యుద్ధ విమానాలను మోహరించాం’’ అని సీడీసీ జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడిరచారు.ఇదే విషయంపై భారత వాయుసేనలో డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతీ గతంలోనే స్పందించారు. నష్టం జరగడమనేది పోరాటంలో భాగమేనన్నారు. అయితే, వాయుసేన పైలట్లందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని చెప్పారు. తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ సిందూర్పై సాయుధ దళాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎయిర్ మార్షల్ ఈ విధంగా స్పందించిన సంగతి తెలిసిందే. దేశీయంగా బలోపేతం చేసుకున్న వ్యవస్థలతోనే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని సీడీఎస్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు.‘పాకిస్థాన్ సొంత రక్షణవ్యవస్థలు బలంగా లేకపోవడంతో చైనాపై ఆధారపడిరది. భారత్ ఆకాశ్ వంటి స్వదేశీ వ్యవస్థలనే ఉపయోగించింది. స్పేస్, శాటిలైట్ ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులో ఉంది. మేము మా సొంత శాటిలైట్ వనరులతో సమర్థమంతంగా ఉగ్రశిబిరాలపై దాడులు నిర్వహించాం. ఆ సమయంలో చైనా లేదా విదేశీ శాటిలైట్ చిత్రాలపై దాయాది దేశం ఆధారపడిరది. వారికి ఏ దేశం నుంచి అవి అందాయో స్పష్టంగా తెలియదు కానీ.. వారి మిత్రదేశాల నుంచే అంది ఉండవచ్చు. వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. ఆధునిక రక్షణ వ్యవస్థలో సొంతంగా నిలదొక్కుకుంటున్నాం. ఆత్మనిర్భర్ భారత్తోనే ఇది సాధ్యమవుతోంది. స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, పెద్ద పరిశ్రమలు ఇప్పుడు రక్షణవ్యవస్థలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇదే మా అతిపెద్ద బలం యుద్ధమంటూ వచ్చినప్పుడు నష్టం జరుగుతుంది. అయితే, నష్ట తీవ్రత కంటే.. ప్రత్యర్థులపై మన స్పందన ఎలా ఉందనేది ముఖ్యం. కేవలం మూడు రోజుల్లోనే సమర్థమంతంగా, పౌరులకు ఎలాంటి నష్టం కలిగించకుండా మేం స్పందించాం’ అని చౌహాన్ పేర్కొన్నారు. ఈసందర్భంగా భారత్ దీర్ఘకాల యుద్ధాలను ఎప్పుడూ కోరుకోదని.. అది దేశ అభివృద్ధిని మందగిస్తుందన్నారు. అలాగే రక్షణ రంగంలో ఆటోమేషన్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.