సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ అరెస్టును ఖండించిన హరీశ్ రావు

సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ ను పోలీసులు అర్థరాత్రి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని, ప్రజాపాలన అంటే ఇదేనా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.తెలంగాణలో సోషల్ మీడియా యాక్టివిస్ట్, ‘తెలుగు స్క్రైబ్’ అడ్మిన్ గౌతమ్ అరెస్టు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ అరెస్టుపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు. “ప్రభుత్వ అక్రమాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడాన్ని ప్రశ్నిస్తే ఇలా టార్గెట్ చేసి కేసులు పెడతారా?” అని నిలదీశారు.ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హరీశ్ రావు, అక్రమంగా అరెస్టు చేసిన గౌతమ్ ను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ డీజీపీని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును నొక్కేయాలని చూడటం సరికాదని ఆయన హితవు పలికారు.