భారత నారీశక్తిని సవాల్ చేసిన ఉగ్రవాదులను మట్టిలో కలిపాం
` మోదీ
భోపాల్(జనంసాక్షి): పహల్గాంలో దాడికి పాల్పడి.. భారత నారీశక్తికి సవాల్ విసిరి.. ఉగ్రవాదులు వారి వినాశనాన్ని వారే కొనితెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా..’ఆపరేషన్ సిందూర్’లో పలువురు మహిళా అధికారిణులు పాల్గొని ఉగ్రవాదుల ఆచూకీ గల్లంతు చేశారని కీర్తించారు. రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా భోపాల్లో నిర్వహించిన ‘మహిళా స్వశక్తికరణ్ మహా సమ్మేళన్’లో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులే కాదు.. వారిని పోషించేవారు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ప్రపంచానికి చాటి చెప్పిందని ప్రధాని పేర్కొన్నారు. ఆ సమయంలో భారత కుమార్తెల బలాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్లోని సరిహద్దు రాష్ట్రాలపై పాక్ దాడులు చేసినప్పుడు అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారి నేతృత్వంలోని మహిళా బీఎస్ఎఫ్ బృందం మూడు రోజుల పాటు అఖ్నూర్లోని తమ ఫార్వర్డ్ పోస్టులపై పోరాడారని కీర్తించారు. ‘’మన సంప్రదాయంలో ‘సిందూర్’.. ‘నారీశక్తి’కి చిహ్నం. పహల్గాంలో, ఉగ్రవాదులు కేవలం మన పౌరుల రక్తం మాత్రమే కళ్ల చూడలేదు. మన సంస్కృతిపై దాడి చేశారు. మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించారు. ఉగ్రవాదులు భారత నారీశక్తికి విసిరిన సవాలే వారి పాలిట, వారిని పోషిస్తున్న వారి పాలిట శాపంగా మారింది. పాకిస్థాన్ సైన్యం కూడా ఊహించని ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలపై మన సాయుధ దళాలు దాడులు చేశాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం చేపట్టిన ఈ ఆపరేషన్ భారత చరిత్రలోనే అతిపెద్ద విజయం’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. భోపాల్లో నిర్వహించిన ‘మహిళా స్వశక్తికరణ్ మహా సమ్మేళన్’లో పాల్గొన్న ప్రధాని మోదీ ఇందౌర్ మెట్రో, దాటియా, సత్నా విమానాశ్రయాల సూపర్ ప్రియారిటీ కారిడార్లను వర్చువల్గా ప్రారంభించారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ.483 కోట్లతో నిర్మించిన కొత్త అటల్ గ్రామ సేవా సదన్ (పంచాయత్ భవన్)లకు ఇవ్వాల్సిన మొదటివిడత మొత్తాన్ని మోదీ బదిలీ చేశారు. 18వ శతాబ్దానికి చెందిన మాల్వాలోని హోల్కర్ రాజవంశానికి చెందిన రాణి అహల్యాబాయి అసాధారణ పాలన, సామాజిక సంక్షేమంపై నిబద్ధతను కొనియాడారు. రాణి అహల్యాబాయికి అంకితం చేసిన పోస్టల్ స్టాంప్, రూ.300 స్మారక నాణాన్ని ప్రధాని విడుదల చేశారు.