అతితక్కువ రన్‌టైమ్‌తో విడుదలకు సిద్దంగా థాంక్యూ

అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం ’థ్యాంక్యూ’ విడుదలకు సిద్ధమైంది. నిజానికి ఈ సినిమా జూలై 8న థియేటర్స్‌లోకి రావాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ నెల 22కు విడుదల తేదీ మార్చారు. అక్కినేని ఫ్యామిలీకి ’మనం’చిత్రంతో మెమరబుల్‌ హిట్‌ ఇచ్చిన విక్రమ్‌ కె కుమార్‌ ఈ సినిమాకి దర్శకుడు అవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంతకు ముందు విడుదలైన ’థ్యాంక్యూ’ చిత్రం టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే.. ఈ సినిమాలోని సింగిల్స్‌కు కూడా మంచి అప్లాజ్‌ వచ్చింది. ఇదిలా ఉంటే..
ఈ సినిమాకు చాలా తక్కువ రన్‌టైమ్‌ను ఫిక్స్‌ చేయడం గమనార్హం. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు ఈ మధ్యకాలంలో రెండున్నర గంటలకు కాస్త ఎక్కువగానే రన్‌ టైమ్‌ను సెట్‌ చేస్తున్నారు. అయితే ’థ్యాంక్యూ’ చిత్రానికి మాత్రం కేవలం 2గంటల 9 నిమిషాలు మాత్రమే ప్రదర్శనా సమయాన్ని నిర్ణయించడం ఆశ్చర్యం అనిపిస్తోంది. ఇందులో నాగచైతన్య జీవితం ’ప్రేమమ్‌’ తరహాలో.. మూడు దశల్లో కనిపిస్తుందని చెబుతున్నారు. రాశీఖన్నా , అవికాగోర్‌ ,మాళవికా నాయర్‌ లతో చైతూ ప్రేమ సన్నివేశాలు అందరినీ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటాయని దర్శకుడు చెబుతున్నాడు. ఇక చైతూ మహేశ్‌ బాబు ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ కు ప్రెసిడెంట్‌ గా నటిస్తున్నట్టు సమాచారం. దానికి సంబంధించిన సన్నివేశాలు మహేశ్‌ అభిమానుల్ని కూడా మెప్పిస్తాయని టాక్‌. సాయి సుశాంత్‌ రెడ్డి, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. పిసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ చిత్రానికే హైలైట్‌ కానుంది. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ లో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ ను వేగవంతం చేశారు. అందులో భాగంగా.. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవలే జరిగింది.