కారెక్కిన ఎంపీ మల్లారెడ్డి

3

– ముఖ్యమంత్రి  పథకాలు ఆకర్షించాయి

హైదరాబాద్‌,జూన్‌ 1(జనంసాక్షి): క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. మల్లారెడ్డికి గులాబీ కండువా కప్పిన సీఎం పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలు తనను ఎంతోగాను ఆకర్షించాయని తెలిపారు. బంగారు తెలంగాణ భాగస్వామ్యయ్యేందుకు టీఆర్‌ఎస్‌లో చేరానని చెప్పారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ మంచి పథకాలు అని కొనియాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం చంద్రబాబు మంచి విజన్‌ ఉన్న నేతలు అని తెలిపారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామిని కావడానికే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని మల్లారెడ్డి తెలిపారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీగా పోటీచేసి తొలిసారి గెలుపొందారు. మల్లారెడ్డి పార్టీని వీడడంతో తెలంగాణలో టీడీపీకి మిగిలిన ఏకైక ఎంపీ స్థానం కూడా చేయిజారిపోయింది. మల్లారెడ్డి చేరికతో టీఆర్‌ఎస్‌ మరింత బలపడుతుందని కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మల్లారెడ్డి చేరికతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో టీడీపీ ఉనికి దాదాపు కనుమరుగయినట్లే. పార్టీకి తెలంగాణలో మిగిలిన ఏకైక ఎంపీ, మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందిన చామకూర మల్లారెడ్డి బుధవారం అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలోని మల్కాజిగిరి ఎంపీ స్థానంతో పాటు ఎల్‌బీనగర్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, కంటోన్మెంట్‌, జూబ్లిహిల్స్‌, సనత్‌నగర్‌ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు నెగ్గారు. వీరిలో ఒక్క ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య మినహా మిగిలిన వారంతా ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. కృష్ణయ్య సైతం సొంత కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. నగరంలో పార్టీకి పెద్ద దిక్కుగా మిగిలిన ఎంపీ మల్లారెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోతుండటంతో టీడీపీ ఉనికి నామమాత్రంగానే మిగిలిపోనుంది. సొంత రాష్ట్రంలో సొంత ప్రజలకు మరింతగా దగ్గరగా ఉండాలనే టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.