అర్హులైన పేదలందరికీ త్వరలో ఇందిరమ్మ ఇళ్లు ` మంత్రి ఉత్తమ్‌


హుజూర్‌ నగర్‌(జనంసాక్షి):పేదోడి సొంతొంటి కల త్వరలో నెరవేరబోతుందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. గురువారం క్రిస్మస్‌ పర్వదినం సందర్బంగా హుజూర్‌ నగర్‌ పట్టణంలోని శ్రీనగర్‌ చర్చి, తిలక్‌ నగర్‌ చర్చి, మేళ్లచెరువు రోడ్‌ లో చర్చి, గోవిందపురం చర్చి, సాయిబాబా థియేటర్‌ వెనకవైపునున్న చర్చి, మిర్యాలగూడ రోడ్డు చర్చి, దద్దనాల చెరువు కాలనీ చర్చి, శ్రీలక్ష్మి నరసింహ పంక్షన్‌ హల్‌ లలో నిర్వహించిన ప్రార్థనలో మంత్రి ఉత్తమ్‌ పాల్గొని కేకే కట్‌ చేసి అందరికి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ ఏసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా దైవ సన్నిధిలో మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రేమ, త్యాగం, మానవత్వానికి ప్రతీక అయిన క్రిస్‌ మస్‌ పండుగ మీ జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యలతో వెలుగులు నింపాలని ఏసు క్రీస్తును కోరుకుంటునట్లు ప్రజలందరికీ హృదయపూర్వక క్రిస్‌ మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.హుజూర్‌ నగర్‌ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2160 సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లులు త్వరలో నిర్మాణం పూర్తవుతాయని, త్వరలో అధికారులు దరఖాస్తులు స్వీకరించి, పరిశీలించి అర్హుల జాబితా తయారు చేస్తారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిబంధనల మేరకే సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లులు కేటాయింపు జరుగుతుందని అర్హులైన పేదలందరకి ఇల్లులు మంజూరు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇల్లులు ఇంటి స్థలం ఉన్న వారికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది కానీ సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లులు ఇంటి స్థలం ఉన్న, లేకపోయినా అర్హులైన అందరికీ మంజూరు చేస్తామన్నారు. రామస్వామి గుట్ట వద్ద ఒకే చోట 2160 సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లుల నిర్మాణం పూర్తవటంతో మంత్రి ఉత్తమ్‌ 13 సంవత్సరాల కృషి ఫలించి అందుబాటులోకి రాబోతున్నాయని అన్నారు. ఈ సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణిలో ఎవరికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా అర్హత మేరకే పారదర్శకంగా పంపిణీ చేస్తారన్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌ కు చర్చి పెద్దలు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపి శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తన్నీరు మల్లికార్జునరావు, ఎండి. అజీజ్‌ పాషా, యరగాని నాగన్న గౌడ్‌, కోతి సంపత్‌ రెడ్డి, దొంతగాని శ్రీనివాస్‌ గౌడ్‌, కోల్లపూడి యోహాన్‌, కోల్లపూడి దయాకర్‌, దగ్గుబాటి బాబురావు, కోల్లపూడి చంటి, వివిధ చర్చిల పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.