నాకిష్టం లేకున్నా ఆ రోల్‌ చేశా

ఎద్దుల నాగేంద్ర పాత్రపై ప్రకాశ్‌ రాజ్‌
ప్రకాశ్‌ రాజ్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. నటుడిగా తన కెరియర్‌ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన తన నట విశ్వరూపాన్ని చూపుతూనే ఉన్నారు. పెద్దగా గ్యాప్‌ లేకుండానే వివిధ భాషల్లో ఆయన బిజీ అయ్యారు. విలక్షణమైన ఆయన నటనకు అంతా అభిమానులుగా మారిపోయారు. టాలీవుడ్‌ విషయానికే వస్తే అప్పటివరకూ బాలీవుడ్‌ విలనిజం ఇక్కడ రాజ్యమేలుతూ ఉండేది. గ్రావిూణ స్థాయి విలనిజంలోను బాలీవుడ్‌ ఆర్టిస్టుల హవా కొనసాగేది.ప్రకాశ్‌ రాజ్‌ టాలీవుడ్‌లో అడుగుపెట్టిన తరవాత వేరే విలన్స్‌ గురించిన ఆలోచన మేకర్స్‌ కి రాకుండా చేశారు. హీరో ఫాదర్‌ గాను .. హీరోయిన్‌ ఫాదర్‌ గాను ప్రత్యేకమైన ముద్రవేశారు. ఈ కారణంగా ఒకానొక సమయంలో ప్రకాశ్‌ రాజ్‌ లేని సినిమా ఉండేది కాదు. అంతగా ఆయన తెలుగు తెరపై తన ప్రభావం చూపించారు. అలాంటి ప్రకాశ్‌ రాజ్‌ తాను చేసిన పాత్రల్లో తనకి నచ్చని ఒక పాత్రను గురించి తాజా ఇంటర్యూలో ప్రస్తావించారు. ముఖ్యంగా ’సరిలేరు నీకెవ్వరు’ సినిమాను గురించి ఆయన ప్రస్తావించడం విశేషం. ఈ సినిమాలో ఆయన ’ఎద్దుల నాగేంద్ర’ పాత్రలో రాజకీయనాయకుడిగా కనిపిస్తారు. దాని గురించి ఆయన మాట్లాడుతూ .. ’ఏదైనా ఒక పాత్రను ఇష్టపడి చేయాలి .. ఆసక్తితో చేయాలి .. ఉత్సాహంతో చేయాలి. అలా లేని పాత్రలో ఇన్వాల్వ్‌ కాలేము. మొదటి నుంచి కూడా నాకు మూస పాత్రలు చేయడం ఇష్టం ఉండదు. కానీ కొన్ని సార్లు నా ఇష్టానికి వ్యతిరేకంగా చేసిన పాత్రలు ఉన్నాయి. అలా ’సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోను చేయవలసి వచ్చింది. ఆ పాత్ర నాకు నచ్చకపోయినా .. చేయక తప్పలేదు. కొన్నిసార్లు మన ఆలోచనలకు .. అభిప్రాయాలకు అవకాశం ఉండదని అంటూ కామెంట్‌ చేశారు. ఆ పాత్రను చేయడం నాకు చాలా అసంతృప్తిని కలిగించింది. మహేశ్‌ బాబు హీరోగా చేసిన ఆ సినిమాలో ఆ పాత్ర నేను ఇబ్బంది పడుతూ చేశాను. కానీ ఆయన నిర్మించిన ’మేజర్‌’ సినిమాలోని పాత్రను ఇష్టపడి చేశాను. అందువలన బ్యాలెన్స్‌ అయిందనే అనుకుంటున్నాను. నా కెరియర్‌ లో నేను చాలా సినిమాలు చేసి ఉండొచ్చు. కానీ కాంజీవరం’ .. ’ఆకాశమంత’ .. ’బొమ్మరిల్లు’ వంటి సినిమాలు నాకు నచ్చుతాయి. అలాంటి పాత్రలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆ జాబితాలో ’మేజర్‌’ కూడా చేరింది. ఇక కమర్షియల్‌ సినిమాలకు నేను తీసుకునే పారితోషికం
కంటే నా మనసుకు నచ్చిన పాత్రలను చేయడానికి తక్కువ తీసుకుంటూ ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చారు.