నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి

– మహబూబ్‌నగర్‌ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీశ్‌ సమీక్ష

మహబూబ్‌ నగర్‌ ,జూన్‌ 5(జనంసాక్షి):ఈ ఖరీఫ్‌ సీజన్లో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరందినీచాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు ఆదివారంనాడు ఆ జిల్లా అధికారులను ఆదేశించారు.జూలై కల్లా కల్వకుర్తి ప్రాజెక్ట్‌  నుంచి 1.50లక్షల ఎకరాలు, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌ నుంచి 1.50లక్షల ఎకరాలు, బీమా ద్వారా 1.40లక్షల ఎకరాలు, కోయిల్‌ సాగర్‌ ద్వారా 20వేల ఎకరాలకు సాగునీరందించాలని మంత్రి సూచించారు. లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన కృషి చేయాలన్నారు. కాంట్రాక్ట్‌ ఏజెన్సీలకు బిల్లుల విషయంలో జాప్యం లేకుండా మంత్రి చర్యలు  తీసుకున్నారు. ఇటీవలె పెండింగ్‌ బిల్లులు మంజూరు అయినందున పనులు ఊపందుకుంటున్నయి.మహబూబ్‌నగర్‌ ప్రాజెక్ట్‌లు యుద్దప్రాతిపదికన పూర్తిచేసేందుకు కృషిచేయాలని.. మరో  నెల రోజులుఅత్యంత కీలకమన్నారు. పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్ట్‌లపై  నీటిపారుదల శాఖ మంత్రి సీరియస్‌గా దృష్టి పెట్టారు. నిరంతరం  సంబంధిత అధికారులతో ఫోన్‌ లో, వాట్సా ప్‌ గ్రూపుల ద్వారా సవిూక్షిస్తున్నారు.  నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ పనులు జూలై కల్లా పూర్తి చేయాలని హరీష్‌ ఆదేశించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఈ జిల్లా పై ప్రత్యేక దృష్టి పెట్టారని, జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి హరీష్రావు గుర్తుచేశారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా.. ఖరీఫ్‌ నాటికి లక్ష్యాన్ని సాధించాలని హరీష్‌ రావు కోరారు.పాలమూరు ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టు ల నుంచి ఖరీఫ్‌ లో నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తామని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రసంగంలోనూ సీఎం కెసిఆర్‌ హావిూ ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. కాగా మంత్రి హరీష్‌ రావు ఆదేశాల మేరకు ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌, ఫీల్డు చానల్స్‌ లను తనిఖీలు చేస్తున్నామని ఆయా కాలువల్లో ఉన్న గడ్డి, రాళ్ళు, రప్పలు, ఇతర అడ్డంకులను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నట్టు మహబూబ్‌ నగర్‌ ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఖగేందర్‌ రావు ఆదివారం నాడు తెలియజేశారు. సీఎం కెసిఆర్‌, మంత్రి హరీష్‌ రావు ల ఆదేశాలకు అనుగుణంగా పనుల వేగం పెంచామని ఖరీఫ్‌ లో ఆయకట్టు టార్గేట్‌ పూర్తి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని సి.ఇ చెప్పారు.